కరాటేలో బ్లాక్బెల్ట్ హోల్డర్గా గుర్తింపు పొంది తెలుగు వెండితెరలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న నటుడు సుమన్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్న సుమన్ తన ముప్పై ఏళ్ళ కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశారు. పోలీసు ఇన్స్పెక్టర్గా, లాయర్గా, అన్నయ్యగా, బాబాయ్గా పలు పాత్రల్ని పోషించిన ఆయన్ను 'అన్నమయ్య' చిత్రంలో శ్రీవేకంటరేశ్వర స్వామిగా దర్శకేంద్రుడు తీర్చిదిద్దారు. నటరత్న ఎన్టీఆర్ తర్వాత అటువంటి పాత్రుల ఇటీవలికాలంలో తనకే దక్కడం పూర్వజన్మ సుకృతమని అంటారాయన.
ఇలా ఎన్నో చిత్రాలు చేసినా.. ఎన్ని వేషాలు వేసినా రాని పేరు ప్రతిష్టలు సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన 'శివాజీ'తో రావడం ఊహించని అదృష్టంగా భావిస్తున్నారు సుమన్. ప్రస్తుతం నీలకంఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జెనీలియా తండ్రిగా నటిస్తున్నారు. ఆ షూటింగ్ గ్యాప్లో ఆయనను పలుకరించగా....
ప్ర: మీల 30 ఏళ్ల సినీ జీవిత విశేషాలు ఏమిటి? సు: నా 30 ఏళ్ల సినీ కెరీర్లో ఎంతో మంది దర్శకుల వద్ద పనిచేసినా ఇంకా ఏదో తెలియని వెలితి ఉందనిపించేది. చాలామంది అంటుండేవారు... నా బాడీ లాంగ్వేజ్కు సరిపడా పాత్రను ఏ దర్శకుడూ ఉపయోగించుకోలేదని. అయితే.. 'శివాజీ' చిత్రంతో ఆ లోటు తీరింది. ఇంకో విషయం ఏమిటంటే.. 25 ఏళ్ళ క్రితం న్యాయం మీరే చెప్పాలిలో కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రను పోషించాను. అందులో కథానాయుకుడిని నేనైతే గెస్ట్గా వచ్చే పోలీసు పాత్ర రజనీకాంత్ పోషించారు. అయితే.. ఇపుడు అంటే.. తొలినాళ్ళలో రజనీ ఎలా ఉన్నారో.. ఇంత పెద్ద ఇమేజ్ సాధించినప్పటికీ ఆనాటి రజనీయే నా ముందు ఉన్నట్టు ఫీలయ్యాను.
ప్ర: ప్రస్తుతం సినిమాల ట్రెండ్ ఎలా సాగుతోంది? సు: జీవితంలో రిస్క్ లేకపోతే ఏమీ సాధించలేం. ఏదో జరుగుతుందని ఆలోచిస్తూ.. భయపడుతూ కూర్చొనేకన్నా దాన్ని అమలు చేయడమే ఉత్తమం. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి విలన్గా చేయడమే కష్టం. అసలు ప్రేక్షకులు ఆ పాత్రలో ఆమోదించడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఈ పరిస్థితుల్లో నేను తీసుకున్నది రిస్కే. అయినా కొన్ని లెక్కల్తో తీసుకున్న రిస్క్ అది. మొదటిది.. దర్శకుడు శంకర్ కావడం. రెండోది.. రజనీకాంత్ చిత్రం కావడం. మూడోది.. ప్రతిష్టాత్మకమైన ఏవీఎం సంస్థ కావడం. అందుకో నేను ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. శంకర్ చిత్రమంటే ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ ఉంది. ఆయన తీసిన చిత్రాన్ని ఒక్కసారైనా చూడాలని ప్రతి ప్రేక్షకుడు భావిస్తారు. అలాగే.. నేనూ. ఆయన చిత్రంలో ఒక్క సీన్లో అయినా కనిపించాలని భావించాను. అందుకే ఆదిశేషు పాత్రను పోషించాను.
ప్ర: మీకు ఆ అవకాశం ఎలా దక్కింది? సు: మొదటగా ఈ పాత్రకు అమితాబ్ బచ్చన్ను అనుకున్నారనీ కొన్ని వైబ్సైట్స్ రాశాయి. అయితే.. శంకర్ సినిమాకి ఏడాది పాటు కాల్షీట్ ఇవ్వడం కుదరక ఆయన విరమించుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత సంజయ్దత్, ఆయన టాడా కేసు చిక్కుల్లో ఉండటం వల్ల సాధ్యపడలేదు. అనంతరం నానాపటేకర్. ఈయనా హాలీవుడ్ చిత్రంలో బిజీగా ఉండటంతో అదీ కుదరలేదు. ఉత్తరాది నటులు అయిపోయాక, మళయాళ స్టార్ మోహన్లాల్ను అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు. ఓ రోజు శంకర్ ఆఫీసు నుంచి నాకు ఫోన్ వచ్చింది. వేరే చిత్రానికనీ వెళ్లాను. చివరకు అక్కడకు వెళ్లాక శివాజీ చిత్రానకీ తెలిశాక చాలా సంతోషపడ్డాను.