"ఆనంద్"తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెంగాలీ భామ కమలిని ముఖర్జీ. ఆమె తొలి చిత్రం "ఫిర్మిలింగే" అనే బాలీవుడ్ చిత్రం. ముంబైలో మోడలింగ్ చేస్తున్న ఆమెకు మంచి కాఫీలాంటి కథను చెప్పి శేఖర్ కమ్ముల ఒప్పించారు. ఆ చిత్రంలో పాత్రకు జీవం పోసిన కమలిని నంది పురస్కారాన్ని కూడా సాధించింది.
ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చినా... "మీనాక్షి" చిత్రంలో రాజీవ్ కనకాల సరసన నటించింది. కానీ ఈ చిత్రం ఆమెను నిరాశపరిచింది. ఆ తర్వాత "స్టైల్"లో ప్రభుదేవా చెల్లెలు పాత్రలో నటించింది. స్వతహాగా డాన్సరయిన ఆమె... ఆ పాత్రలో అందరినీ మెప్పించింది. ఆ తర్వాత "గోదావరి", రాఘవన్, పెళ్ళయింది కానీ... వంటి చిత్రాలు చేసింది. తాజాగా పవన్కళ్యాణ్ సరసన "జల్సా"లో నటిస్తోంది. ఆమెతో కాసేపు మాటామంతీ... ప్రశ్న: ఫిలిం ఇండస్ట్రీలో ఎవరైనా ద్వితీయ విఘ్నమని భయపడుతుంటారు. మీ విషయంలో మీనాక్షి అలా అనిపించిందా? జ: అలా అనిపించలేదు. నాకు పూర్తిగానచ్చాకే పాత్రను అంగీకరిస్తాను. కానీ రెండవ సినిమా చేసేటప్పుడు చాలామంది మీరన్నట్లు చెప్పారు. కానీ నాకలాంటి సెంటిమెంట్లు లేవని సమాధానమిచ్చాను. అయినా సినిమా అపజయం పట్ల కాస్త బాధ వేసింది.
ప్రశ్న: ఇప్పుడు "పెళ్ళయింది కానీ" సినిమా కూడా అదేకోవలోకి వస్తుందంటున్నారు? జ: కథ చాలా బాగుంది. తండ్రిని రక్షించుకునేందుకు తన ప్రేమను త్యాగం చేసిన యువతి పాత్ర. థియేటర్లలో రెస్పాన్స్ బాగుంది. ఈ పాత్రను చూసి పాత సినిమా కథ అన్నారు. కానీ ఆ సినిమాలు నేను చూడలేదు.
ప్రశ్న: ఆ తర్వాతైనా ప్రాధాన్యత గల పాత్రలకు ముఖ్యత్వం ఇచ్చారా? జ: నాకు పాత్ర పూర్తిగా నచ్చితేకానీ ఒప్పుకోను. "ఆనంద్" నుంచి "పెళ్ళయింది కానీ" వరకు అన్నీ అలాంటివే. రేపు రాబోయే "జల్సా"లో కూడా పాత్ర నచ్చే చేస్తున్నాను. ప్రశ్న: ఎటువంటి పాత్ర? జ: అది ఇప్పుడే చెప్పలేను.
|