రామ్గోపాల్వర్మ ఎక్కడ ఏది మాట్లాడినా సంచనలమే. ఏదోవిధంగా గొడవచేసి పబ్లిసిటీ చేసుకోవడం అనేది తన పనికాదనీ, తను చేసేది.. చెప్పేది సూటిగా ఉంటుందని వర్మ స్పష్టం చేస్తున్నారు.
సినిమా తర్వాత సినిమా చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే రామ్గోపాల్ వర్మ హిందీలో నితిన్, ప్రియాంకచోప్రాతో 'ఆగ్యాత్' తీశాడు. దాన్ని తెలుగులో 'అడవి'గా ఆగస్టు 7న విడుదల చేస్తున్నారు.
ఆ తర్వాత "రణ్" విడుదలకు సిద్ధమైంది. అనంతరం పరిటాల రవి హత్య నేపథ్యంలో 'రక్తచరిత్ర'ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. 'అడవి' ప్రమోషన్లో భాగంగా ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆయన వెబ్దునియాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ వివరాలు మీకోసం...
ప్రశ్న: అడవి నేపథ్యంలో చాలా చిత్రాలు వచ్చాయి. మీరే 'జంగిల్' తీశారు. మరి తాజా చిత్రంలో గల ప్రత్యేకత ఏమిటి? జ: కరెక్టే. చాలానే వచ్చాయి. నేను తీసిన జంగిల్ అనేది కిడ్నాప్ డ్రామా. ఈ అడవి మాత్రం.. భయంతో కూడిన స్టోరీ. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరుణంలో వాటి మేళవింపుతో కొత్తగా తీశాను. మనలోపల తెలీని భయం ఉంటుంది. అలాంటి భయం రూపం లేకుండా అడవిలో వుందని భావిస్తే ఎలా ఉంటుంది అనేది. సరికొత్త కోణంలో చూపాం.
ప్రశ్న: నితిన్ను ఎంపికచేయడానికి ప్రత్యేక కారణం? జ: దక్షిణాదిలో చాలామంది నటులుండగా నితిన్ను ఎందుకు తీసుకున్నారని చాలామంది అడిగారు. కథ రాసుకున్నప్పుడే పర్టిక్యులర్ పర్సన్ అనుకుని నితిన్ తీసుకున్నాను. బేసిక్గా కథకూడా అలాంటిది. సినిమా షూటింగ్ నిమిత్తం అడవికి చిత్ర యూనిట్ వెళుతుంది. అందులో కో-డైరెక్టర్గా నితిన్ నటించాడు. ఆ క్వాలిటీస్, లుక్ నితిన్లో కన్పించాయి.
ప్రశ్న: శ్రీలంకనే షూటింగ్ స్పాట్గా ఎందుకు ఎంపిక చేశారు? జ: సెంట్రల్ శ్రీలంకలోని అడవుల్లో షూటింగ్ చేశాం. అక్కడ దట్టమైన అడవులుంటాయి. కథకు కూడా అలా కన్పించాలి.
ప్రశ్న: షూటింగ్ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదా? జ: ఆ అడవి విషసర్పాలకు నిలయమని చెప్పారు. అయినా దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నాం. యాంటీ పాయిజన్ ఇంక్షన్లు రెడీ చేసుకున్నాం.
ప్రశ్న: ఎల్టీటీఈ నుంచి బెదిరింపులు రాలేదా? జ: అక్కడ ఎల్టీటీఈ స్థావరాలున్నాయని చెప్పారు. కానీ నాకు వారి నుంచి ఎటువంటి ఇబ్బంది ఎదురు కాలేదు.
ప్రశ్న: సమకాలీన సమస్యలపై చిత్రాలు తీసే మీరు ఎల్టీటీఈపై చిత్రం తీసే ఆలోచన ఉందా? జ: నాకు ఎల్టీటీఈతో టచ్లేదు. నేను తమిళుడిని కాను. వేరే దేశం అది. ఆ సబ్జెక్ట్ నాకు కరెక్ట్కాదు. తీస్తే ఒకవేళ ఇస్లామిక్ తీవ్రవాదంపై తీయవచ్చు. అదికూడా ఖచ్చితంగా చెప్పలేను.
ప్రశ్న: కంపెనీ, సర్కార్లోనూ ఇస్లామిక్ వాదాన్ని టచ్ చేశారు కదా? జ: అది చాలా తక్కువ. దానిలో ఇస్లామిక్ ఫండమెంటలిజం చెప్పలేదు.
ప్రశ్న: ముంబై తాజ్ సంఘటనపై సినిమా తీసే ఆలోచన ఏమైనా ఉన్నదా? జ: ఇది అడిగారు కాబట్టి చెబుతున్నా... ఆ సంఘటన జరిగిన హోటల్కు 3 కి.మీ దూరంలోనే నేను ఉన్నాను. దీపావళికి మందులు కాల్చే విధంగా పెద్ద శబ్దం మాకు వినిపించింది. ఏమైందో అర్థంకాలేదు. కాసేపటికి నా స్నేహితులు మెసేజ్ పంపారు. తాజ్ హోటల్లో టెర్రరిస్టులు చొరబడి కాల్చేశారని.. ఆ తర్వాత టీవీలో చూసి చలించిపోయాను. కానీ వాస్తంగా అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. టాప్ పోలీస్ ఆఫీసర్స్ చనిపోయారు. ఒకటికి పదిసార్లు మీడియా చూపించిందే చూపించి.. చాలా ఎక్కువ చేశారు.
ప్రశ్న: మీరు తాజాగా తీస్తున్న 'రణ్' మీడియాపై అస్త్రం కదా? ఎలా చూపించబోతున్నారు? జ: రణ్ చిత్రం షూటింగ్ పూర్తయింది. నవంబర్లో విడుదలవుతుంది. ఈ చిత్రంలో మీడియాలో జరిగే అంతర్గత ప్రక్రియను చూపించబోతున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా తమ రేటింగ్ పెంచుకోవడం కోసం రకరకాలుగా మనుషుల మనసులపై ఆడుకుంటోంది.
ముఖ్యంగా రాజకీయ మీడియా సమాజాన్ని చెడగొడుతోంది. ప్రజల్ని పక్కదోవ పట్టిస్తోంది. జరిగిన సంఘటనను జరిగినట్లుగా చూపాలి. దానికి లేనిపోని ఉపమానాలు, ఫ్లాష్బ్యాక్లు చూపించేసి మర్చిపోయిన దాన్ని మరలా గుర్తుకు తెచ్చి తప్పుడు వార్తలు చూపిస్తున్నారు. అందుకే రాజకీయ మీడియా చీకటి కోణాల్ని వెలికి తెస్తున్నా.
ప్రశ్న: అంటే ఏవిధంగా? రాజకీయనాయకులపై సెటైరా? జ: కానేకాదు. డైరెక్ట్ అటాక్. సంఘటన జరిగినప్పుడు సంఘటనగా చూపండి. 'విరామం తీసుకుంటున్నాం. ఎక్కడికీ వెళ్ళొద్దు..'అంటూ ఛానళ్లల్లో చెప్పి క్రింద మరో వార్త స్క్రోలింగ్ వేసి ఆసక్తికరంగా చెప్పడం తప్పంటాను. దీనికంటే పెద్ద తప్పు ఇంకోటి ఉంది. ఏదైనా సంఘటనలో ఎవరైనా చనిపోతే పదేపదే శవాల్ని చూపించి మనసుషుల మనసుల్ని కలచివేస్తున్నారు.
అదే విదేశాల్లో వేరుగా ఉంటుంది. అమెరికాలో సెప్టెంబర్ 11న జరిగిన సంఘటనను తీసుకుంటే... అన్ని అంతస్థుల భవనం కూలిపోతే ఎంతోమంది చనిపోయారు. కానీ అంతర్జాతీయ ఛానళ్ళు ఎక్కడా శవాలను చూపించలేదు. అదే మనవాళ్లు... ముఖ్యంగా తెలుగు ఛానల్స్... పదేపదే శవాల్ని చూపించాయి. దీన్ని చూస్తే మనుషుల్తో వ్యాపారం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఒళ్ళు గగుర్పాటు కలిగే విజువల్స్ రౌండ్ ది క్లాక్గా చూపిస్తారు.
అదే.. బిబిసి, ఐఎన్ఎన్ ఏదైనా తీసుకుంటే విదేశాల్లో వార్తను వార్తగా చెబుతారు. సంఘటనను సంఘటగా చూపిస్తారు. దానికి లేనిపోనివి జోడించి రేటింగ్ పెంచుకోవడం.. ఉండదు. దీనికి ప్రధానకారణం మన రాజకీయ వ్యవస్థ సరిగ్గాలేక పోవడమే.
ప్రతి ఛానల్కు ఏదో రాజకీయ నేపథ్యం ఉంటూనే ఉంది. దీనివల్ల మీడియా భ్రష్టు పట్టింది. పైగా.. ఒక్కో ఛానల్ పోటీలు పడి మర్డర్లు ఎలాచేయాలి? అనేవి ఆసక్తికరంగా చూపుతున్నాయి. మన అభివృద్ధి ఎటువైపు పోతుందో అర్థంకావడం లేదు. ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? వీటిపై నియంత్రణ లేదా? అని ప్రశ్నిస్తున్నా.
ప్రశ్న: "రక్తచరిత్ర" తెరకెక్కితే ఒక వర్గానికి సపోర్ట్గా చూపించాల్సి వస్తుంది కదా? జ: ఎవరికీ ఫేవర్గా తీయను. అక్కడ ఉండే పరిస్థితులు. భావోద్వేగాన్ని మాత్రమే తీసుకుని సినిమా తీస్తా. రాజకీయ కోణాన్ని టచ్చేసే ఆలోచనలేదు. ఇదేదో ఫలానా వారిని మంచిగా చూపారనే ప్రసక్తేరాదు.
ప్రశ్న: 'శివ' తర్వాత మళ్ళీ అంత రేంజ్లో మీకు పేరు రాలేదు? కారణం విశ్లేషించారా? జ: సత్య, రంగీలా తీశాను. కానీ అందరూ శివతోనే కంపేర్ చేస్తుంటారు. ఒకానొక టైమ్కు సంబంధించి తీసిన సినిమా శివ. దానికంటే శ్రద్ధపెట్టి "నిశ్బబ్ద్" తీశాను. అయినా శివతోనే కంపేర్ చేశారు. ప్రేక్షకులు ఎలా అన్వయించుకుంటున్నారో చెప్పలేం. వారికి అది నచ్చవచ్చు.
ప్రశ్న: ఔత్సాహికులైన దర్శకులు మిమ్మల్ని రోల్మోడల్గా తీసుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? జ: దర్శకత్వం అనేది స్వంత బాణీ. ప్రతివారికి ఒక్కో ఐడియా ఉంటుంది. ఆ కోణంలోంచే చూపాలి. నాలో కొన్ని క్వాలిటీస్ వారికి నచ్చి ఉండవచ్చు . నేనూ చాలా ఫెయిల్యూర్స్ తీశాను. అయినా నన్నే అందరూ అనుకోవడంకూడా తప్పులేదు. కానీ ఎవరి టాలెంట్ వారిది. ఆ దిశగా అందరూ ప్రయత్నించాలి. కొన్ని సార్లు సక్సెస్లు, పెయిల్యూర్స్ రావచ్చు.. దాంతో వెనుకడగు వేయకూడదు.
ప్రశ్న: విధిని నమ్ముతారా? జ: నమ్మడం, నమ్మకపోవడం కాదు సమస్య. మన పని మనం చేసుకుంటూ పోవడమే నాకు తెలిసింది. ఏదైనా మధ్యలో అడ్డంకులు వస్తుంటాయి. దాన్నే విధిగా భావిస్తా.
ప్రశ్న: లేటెస్ట్గా 'గే'పై పెద్ద చర్చ జరుగుతోంది కదా? దీనిపై కూడా సినిమా చేసే ఆలోచన ఉందా? జ: (పెద్దగా నవ్వుతూ..) ఇంతవరకూ రాని ఆలోచన ఇది. అందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అంటూ.. ముగించారు.