తన కొత్త చిత్రం "రణ్"లో జర్నలిస్టులను పాజిటివ్ కోణంలో చూపించేందుకు నేనేమైనా వెధవలా కనిపిస్తున్నానా అంటూ ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత రామ్గోపాల్ వర్మ మండిపడ్డారు. జర్నలిస్టుల నేపథ్యంలో సాగే ఈ చిత్ర కథను లీక్ చేయలేనని, విడుదలైన తర్వాత మీరే చూసి తెలుసుకోండని రామ్ విలేకరులతో కఠువుగా అన్నారు.
హిందీ చిత్రం "పూంక్-2"ను తెలుగులో "గాలి" అనే పేరుతో విడుదల చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. Z3 ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందిన ఈ చిత్రానికి నిర్మాతలు బుర్రా ప్రశాంత్, చంద్రశేఖర్. మిలింద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తాలూకు ప్రమోషన్ కోసం రామ్గోపాల్ వర్మ హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనను "వెబ్దునియా తెలుగు" కలిసి మాట్లాడింది. ఆ విశేషాలు మీకోసం...
ప్ర. "గాలి" పేరు వింటేనే ఇదేదో దెయ్యం చిత్రం అనిపిస్తోంది. నిజమే అనుకోవచ్చా? జ. నిజమే. గతంలో పూంక్-1 తెలుగులో "రక్ష"గా విడుదల చేశాం. ఆ చిత్రంలో హీరో భార్య చనిపోతుంది. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం విడుదల చేస్తున్న ఈ "గాలి" చిత్రంలో చనిపోయిన హీరోయిన్ దెయ్యంలా కనిపిస్తుంది.
ప్ర. ఇటీవల తరచుగా మీరు దెయ్యాలు, భూతాలపై చిత్రాలు చేస్తున్నారు. ఇటువంటివి సమాజాన్ని పక్కదోవ పట్టించవా? జ. నేనేదో అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనులు చేసి సినిమా తీయడం లేదు. సమాజంలో ఉన్న నమ్మకాలు, జరుగుతున్న సంఘనటల ఆధారంగానే చిత్రాన్ని చేస్తున్నా. మీకు నచ్చితే చూడండి. లేదంటే మానేయండి.
ప్ర. ధోనీని హీరోగా పెట్టి మీరు సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? జ. అసలు ఆ ధోనీ ఎవరో నాకు తెలియదు.
ప్ర. అదేంటి. భారతజట్టు క్రికెట్ కెప్టెన్.. పైగా అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కిన ధోనీ గురించి మీకు తెలియదా..? జ. నేను క్రికెట్ చూడను. సినిమాలే నా లోకం
ప్ర. మీరే స్వయంగా ధోనీ ఫోటోలను పంపమని అడిగినట్లుగా వార్తలు వచ్చాయిగా...? జ. ఇప్పుడు నే చెబుతున్నాగా కాదనీ.
ప్ర. ఆరంభంలో శివ, క్షణక్షణం వంటి మంచి మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించి.. ఇప్పుడేమో దెయ్యం, అడవి, గాలి వంటి దెయ్యపు చిత్రాలు తీస్తున్నారు. అంటే అప్పటి పేరును ఇలా క్యాష్ చేసుకుంటున్నారా..? జ. క్యాష్.. క్రెడిట్ వంటివేమీ లేవు. ఎవరైనా కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమాను ఊరకనే తీయరు. బావుందనే ఉద్దేశ్యంతోనే తీస్తారు. నా మదికి నచ్చింది కనుక నేను తీసుకుంటూ పోతున్నాను. నా మైండ్ సెట్కు ట్యూన్ అయ్యే ప్రేక్షకులు ఉంటారు. మీరు గమనించాల్సిందేమిటంటే.. ప్రేక్షకులందరూ ఒకలా ఉండరని. గతంలో "కౌన్" అనే సినిమాను 18 లక్షలు ఖర్చు పెట్టి తీస్తే దానికి 3 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. దీనికి మీరేమంటారు.
ప్ర. అదిసరే... ఇటీవల మీరు తీసిన "అడవి" అర్థంపర్థం లేని చిత్రమని చాలామంది అంటున్నారు. పైగా సినిమాను ముగించకుండా "ఇంకావుంది" టైపులో రెండో భాగంలో మిగిలిన సినిమా అంటున్నారు. ప్రేక్షకులు నిరాశకు గురి కారా? జ. 30 ఏళ్ల కింద మీరు మన తెలుగు పత్రికలను చదివితే... సీరియల్స్లో "ఇంకావుంది" అని చివరన కనబడుతూ ఉండేది. అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలా పత్రికల సీరియల్స్ ఇలానే ఉంటాయి. టీవీ సీరయళ్లు కూడా రోజులకు రోజులు సాగిపోతుంటాయి. అంటే.. తరువాతి భాగంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులలో ఉండబట్టే ఇటువంటి విధానం వచ్చింది. నేను దాన్ని సినిమాల్లో అమలు చేస్తున్నానంతే.
ప్ర. జర్నలిస్టు నేపథ్యంలో "రణ్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పాత్రికేయులను పాజిటివ్గా చూపిస్తున్నారా... నెగిటివ్గా చూపిస్తున్నారా...? జ. తెలివి తక్కువ వెధవలా కన్పిస్తున్నానా పాజిటివ్గా చూపించడానికీ...
ప్ర. అంటే నెగిటివ్గా ఉంటుందా..? జ. అదంతా నేను చెప్పను. సినిమాలో చూడండి. అని ముగించారు రామ్గోపాల్ వర్మ