హిందూ ముస్లిం డాన్ల కథలు తీశాను. దావూద్ ముస్లిం, చోటా రాజన్ హిందువు. వీరిద్దరూ మాఫియా డాన్లు. ఆ కథలు సినిమాగా తీస్తున్నట్లు ముందే తెలుసు. ఏం తీస్తారో... ఎలా తీస్తారో అనే ఇంటరెస్ట్ ఉంటుంది. కంపెనీ సినిమా తీశాను. దానికి బెదిరింపులు వచ్చాయి. అయినా సినిమాగా తీశాను. ఇప్పుడు పరిటాల రవి కూడా అంతే. ఈ చిత్రం తీయడానికి ముందే ప్రకటన ఇస్తే... చాలామంది నాకూ వార్నింగ్ ఇచ్చారు. అయినా సినిమాను సినిమాగానే తీయడమే నా ఉద్దేశ్యమని రామ్ గోపాల్ వర్మ తెలియజేశారు. ఈ చిత్రం గురించి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారూ...? సోమవారం నుంచి... అంటే ఈరోజు నుంచే. ఫిలిమ్ సిటీలో వేసిన సెట్లో చిత్రీకరణ ప్రారంభిస్తున్నాం. రియల్ ప్లేస్లో షూటింగ్ జరుపుతాం. హైదరాబాద్, అనంతపూర్లలో కూడా చేస్తాం.
ఫ్యాక్షనిజాన్ని జనాలు మర్చిపోతున్న తరుణంలో ఈ చిత్రాన్ని తీయడం ఎంతవరకు భావ్యం? అంటే మళ్లీ కత్తులు, కటారులు పట్టుకోమని చెప్పడం లేదు. ఏదైనా జరిగిన సంఘటనను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దీనివల్ల ఎవరికీ ఇబ్బందులు రావని అనుకుంటున్నా.
శివలో చూపించిన చైన్ పద్ధతి సమాజంలో తీవ్ర ప్రభావం చూపింది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుంది? నేనది సినిమాలోనే చూపించా. అది బయట జరుగదు. ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసిన తర్వాత బయటకు వస్తే ఎవడినైనా అలానే కొట్టాలనిపిస్తుంది. వైలెన్స్ ముందు పుట్టిందా...? సినిమా ముందు పుట్టిందా...? అనే ప్రశ్న ఇక్కడ తలెత్తినపుడు వైలెన్సే కదా ముందు పుట్టింది. ఏదైనా సినిమా ప్రభావం సమాజంపై మరీ అంతగా ఉండదని నా అభిప్రాయం.
యదార్థ సంఘటన ఆధారంగా అంటున్నారు. ఎలా చూపించబోతున్నారు? యదార్థ సంఘటనలేగానీ, చాలామటుకు కల్పితాలుంటాయి. నేను చేసిన రీసెర్చ్లో ఓ వర్గం చెప్పింది అంతా నిజమే అని కాదు. మరో వర్గం చెప్పింది అంతా అబద్దమని కాదు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాటి ప్రభావం కొంత ఉంటుంది.
పరిటాల రవితో మీకెలా సంబంధం ఉంది? పదేళ్లక్రితం సత్య అనే సినిమా చూస్తానంటే... ప్రివ్యూ చూపించాను. అప్పుడే కలిశాను. ఆ తర్వాత ఆయన గురించి విన్నాను. నాలుగైదేళ్ల క్రిందటే సినిమా తీయాలనుకున్నాను. 8 నెలల క్రితం అది కార్యరూపం దాల్చింది.
WD
మహాభారతంతో పోలుస్తూ టైటిల్ సాంగ్ తీశారు...? మరి కథ కూడానా..? మహాభారతంలో ఉన్నట్లే ఇక్కడ, అన్నలు, తమ్ములు, వంశం, దాయాదులు వంటి అంశాలున్నాయి. పూర్వీకులు వర్తమానం కూడా ఉంది. అందుకే మహాభారతంతో పోలుస్తూ టైటిల్ సాంగ్ చేశాను. అది సినిమాకు హైలెట్ అవుతుంది. ఆ గీతాన్ని కలువ శాయి రాశారు. సంగీతాన్ని బాపీటోటక్ సమకూర్చారు.
ఎవరెవరు నటిస్తున్నారు? వివేక్ ఒబెరాయ్, తమిళ నటుడు సూర్య నటిస్తున్నారు. మిగిలిన పాత్రలు తర్వాత ప్రకటిస్తాను. హిందీలో శతృఘ్న సిన్హా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత ఫ్యాక్షనిస్టులు మారతారని భావిస్తున్నారా...? ఎవరూ మారరు. మారినట్లు నటిస్తారు. ఏదైనా పరిస్థితులను బట్టి జరుగుతుంది.
ఎన్టీఆర్ పాత్రను మోహన్ బాబు వేస్తున్నారు కదా. ఆయన అనర్గళ డైలాగులు ఎలా చూపించబోతున్నారూ? అవును మోహన్ బాబు పోషిస్తున్నాడు. అది ఎలాగా ఏమిటి...? అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
మీకీ సినిమా తీయాలని ఎప్పటి నుంచి అనిపించింది? సూరి జైలులో ఉండటం.. మీడియా అంతా వారిపైనే కేంద్రీకరించడం... నాయుడుగారి స్టూడియో ముందు బాంబ్ పేలడం వంటి సంఘటనలు విన్నాక... సినిమా తీయాలనే క్లారిటీ వచ్చింది.
ముగింపు ఎలా ఇవ్వబోతున్నారు? అది సినిమా చూడాల్సిందే. పాజిటివ్వా... నెగిటివ్వా అనేది ఇప్పుడే చెప్పలేను.