కేఆర్ రత్నం దర్శకత్వ సారథ్యాన రూపొందుతున్న భూమ చిత్రంలో నవనీత్ కౌర్, రామకృష్ణ తనయుడు శ్రీనివాస్లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శకుంతల నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విలేకరులేర్పాటు చేసిన సమావేశంలో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఈ చిత్రానికి టైటిల్ తగ్గట్టుగా పేరు కుదిరిందని.. మాస్ ప్రేక్షకులతో పాటు లవ్, యాక్షన్ చిత్రాల ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకోగలదని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం వందేమాతరం శ్రీనివాస్ ఇస్తున్నారు. ఇటీవలే ఆస్ట్రేలియా, మలేషియాలో ఈ చిత్ర పాటల చిత్రీకరణ ముగించామన్నారు.
హీరోకు ఈ చిత్రం మొదటిదే అయినా పాత్ర పరంగా ఎంతో అనుభవమున్న వాడిలా చేయడం బాగుందన్నారు. ఈ చిత్రంలో ఇంకా తనికెళ్లభరణి, తెలంగాణా శకుంతల, శివపార్వతి తదితరులు నటిస్తుండగా.. మాటలు వీఎస్పీ తెన్నేటి అందిస్తున్నారు.