"యువసామ్రాట్" అక్కినేని నాగార్జున, త్రిష కాంబినేషన్లో శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "కింగ్". రామోజీ ఫిలింసిటీలో ఈ నెల 14 నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, టాకీ పూర్తయ్యేంతవరకు అదే ఫిలింసిటీలోనే చిత్రీకరణ జరుపుకోనుంది. "హలోబ్రదర్", "శివ" తరహాలో యాక్షన్, ఎంటర్టైన్మెంట్లతో ఈ చిత్రం రూపొందుతోంది.
అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని, నవంబర్లో పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ముగించుకుని, డిసెంబర్ 18న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సినీ యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇకపోతే "కింగ్"లో రెండో హీరోయిన్ను ఇంకా ఎంచుకోలేదు. కామాక్షి మూవీస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న "కింగ్" సినిమాను డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.
గతంలో నాగార్జున నటించిన 'నేనున్నాను', 'బాస్' సినిమాలకు ఆయనే నిర్మాత సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే" సినిమాకు ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్న అందాల భామ "త్రిష" యువసామ్రాట్ నాగార్జునతో తొలిసారి "కింగ్"లో జతకట్టడం విశేషం.
|