అపూర్వ చిత్ర పతాకంపై "ష్.." (ఇది చాలా మంచి ఊరు) చిత్రం రూపొందుతోంది. "కమ్లి" నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బి.సి. హరిశ్చంద్రప్రసాద్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఈ నెల 23వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఆడియోను ప్రముఖ నటి జయసుధ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ... తెలుగువారు విదేశాల్లో ఉంటూ... తెలుగు సినిమాలు తీయడం అభినందనీయమన్నారు.
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా, కెనడా, నార్త్ అమెరికాల్లో యాడ్ ల్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని తెలిపారు.
కథానాయిక మాధవీలత మాట్లాడుతూ... "నచ్చావులే" చిత్రం ద్వారా తనకు గుర్తింపు లభించిందని, ఈ సినిమాతో అంతకంటే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో రియల్లైఫ్కు దగ్గరగా తన పాత్ర ఉంటుందని, హీరోయిన్ అవ్వాలనే గ్రామీణ యువతి పాత్రలో నటించానని మాధవీలత వెల్లడించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు సత్యం మనుమడు శ్రీవాసంత్ సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. రెండే పాటలున్నా... చాలా చక్కని సంగీతం అందించానని భావిస్తున్నట్లు శ్రీవాసంత్ చెప్పారు. శ్రోతల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు శ్రీవాసంత్ వెల్లడించారు.
నటుడు షఫీ మాట్లాడుతూ.. "కమ్లి"లో సపోర్టింగ్ పాత్రను పోషిస్తే, ఇందులో హీరోగా చేశానన్నారు. ఈ సినిమాలో డ్రీమ్సీన్ నిజజీవితంలో కొనసాగేట్లుగా ఉంటుందని, తర్వాత ఏం జరుగుతుంది? అనేంత ఉత్సుకతను కల్గిస్తుందని షపీ చెప్పారు. ఈ పాత్ర కోసం కొంత ప్రిపరేషన్ కూడా చేశానని, అదొక గొప్ప అనుభూతి అని హీరో తెలిపారు.