"అధినేత" వస్తున్నాడోచ్..!
|
ఈ చిత్రం షూటింగ్ గత రెండు రోజులుగా సికింద్రాబాద్లోని మిలిట్రీ ఏరియాలో జరుగుతుంది. బుధవారం అక్కడ అధినేత పెండ్లి తతంగాన్ని చిత్రించారు. ఇందులో దాదాపు తారాగణమంతా పాల్గొన్నారు.
ఇంకా దర్శకుడు చిత్రం గురించి చెబుతూ.. శివరామరాజు తర్వాత జగపతిబాబు కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిదని చెప్పారు. ఓ సామాన్య వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు? అనేది సినిమాలో చూడాల్సిందేనని సముద్ర అన్నారు. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించనున్న ఈ చిత్ర క్లైమాక్స్ను పదిరోజుల పాటు ఖమ్మంలో చిత్రీకరించనున్నామని వెల్లడించారు. త్వరలో ఆడియోను విడుదల చేయనున్నామని చెప్పారు.
చిత్ర నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. జనవరి 17 నుంచి షూటింగ్ ప్రారంభించి ఏకధాటిగా చిత్రాన్ని పూర్తిచేసే క్రమంలో ఉన్నామని వెల్లడించారు. క్లైమాక్స్ తర్వాత రెండు పాటలను విదేశాల్లో చిత్రించాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు చురుగ్గాసాగుతున్నాయని వెల్లడించారు.
జగపతిబాబు మాట్లాడుతూ.. ఈ మాస్ తరహా చిత్రంలో సముద్ర తనను అనుగుణంగా మలిచారని, రాజకీయ నేపథ్య చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నానని చెప్పారు. ఈ సినిమా విడుదల సమయంలో ఎన్నికలు రావడం విశేషమని తెలిపారు.
ఇదేరోజు ఇందులో నటించిన శ్రద్ధాదాస్ పుట్టినరోజును కేక్కట్చేసి చిత్ర యూనిట్ జరిపింది. ఈ చిత్ర సమర్పకుడు రవి (న్యూజెర్సీ) మాట్లాడుతూ.. సినిమా ఇంట్రెస్ట్తో ఇందులో పార్ట్నర్గా చేరానని, మంచి కథాంశంతో కూడుకున్న చిత్రమిదన్నారు. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని వెల్లడించారు.
