కోలీవుడ్ యంగ్ స్టార్ శింబు, నవ్వుల సుందరి స్నేహ, సనాఖాన్ హీరోహీరోయిన్లుగా నటించిన "మా వాడు" చిత్రం ఈ నెల 20వ తేదీన తెరపైకి రానుంది. కె. మురళీధరన్, వి. స్వామినాథన్, టి. రంగనాథన్లు సంయుక్తంగా తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలను ఫిలింఛాంబర్లో ఇటీవలే ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు. ఈ సందర్భంగా భరద్వాజా మాట్లాడుతూ.. లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థ తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిందన్నారు. శింబుతోనే మన్మథ, వల్లభ వంటి హిట్ చిత్రాలను నిర్మించిందని, ఇదే తరహాలో "మా వాడు" కూడా తెలుగులో విజయవంతం కావాలని తమ్మారెడ్డి ఆశించారు.
ఆర్య మీడియా ప్రతినిధి వాసు మాట్లాడుతూ.. తమిళంలో "శిలంబాట్టమ్" పేరుతో డిసెంబరులో విడుదలై హిట్ అయిందని, తెలుగులో ఈ చిత్రాన్ని మా డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చెప్పారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథ ఉంటుందని, యువన్ శంకర్ రాజా సంగీతం అందరినీ ఆకట్టుకుంటుందని వాసు అన్నారు.