21న తెరపైకి వస్తోన్న "కూతురు కోసం"
|
వీరందరూ తమ తమ అభిప్రాయాలను గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నారాయణమూర్తి కమర్షియల్ చిత్రాలు తీయకుండా సామాజిక సమస్యలను ఎంచుకుని తీయడం అభినందనీయమని, సీరియస్ సబ్జెక్టును తీసుకోవడమే గొప్పసాహమని తెలుగు యూనివర్శిటీ ఆచార్యులు సత్యనారాయణ అన్నారు.
పుట్టినిళ్లు, మెట్టినిళ్లు పేరు నిలబెట్టే స్త్రీని హింసించడం, చంపడం చేసే దుర్మార్గులను సమాజం నుంచి వెలివేయాలని, కన్నకూతురు కోసం తండ్రి ఆవేదన, వేదనను నారాయణ మూర్తి కళ్లకు కట్టినట్లు చూపించారని సత్యనారాయణ చెప్పారు. ప్రేమకథా చిత్రాలు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి సామాజిక సమస్య చిత్రంగా రావడం ప్రశంసనీయమని ఆయన అన్నారు.
సమాజానికి మేలు చేసే ఇటువంటి చిత్రాల ద్వారా మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల ముందుకు తెచ్చే అవకాశం ఏర్పడుతుందని, ఇలాంటి సినిమాలు చూసైనా, దుర్మార్గులను శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆవుల మంజులత తెలిపారు.
నారాయణ మూర్తి మాట్లాడుతూ.. గాంధీ చెప్పిన స్వాతంత్ర్యం మనికింకా రాలేదని, స్త్రీలు పగటి పూటనే ఒంటరిగా తిరగలేకపోతున్నారని, దీనికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎందరో ఆడపడుచులు కామాంధుల దాడికి బలైపోతుండటం తనను కలిచివేసిందని అందుకే ఈ చిత్రాన్ని నిర్మించానని చెప్పారు.
