లియో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పరుచూరి బ్రదర్స్ వారసుడు రవీంద్రనాథ్ నటించిన 'జంక్షన్' చిత్రం ఈనెల 26న విడుదల కానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు.
ఈ సమావేశంలో పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, చాలామంది హీరోలకు తొలి సినిమా కథను తామే రాసేవాళ్లమని, ప్రస్తుతం తమ వారసుడు రవీంద్రనాథ్ను హీరోగా జంక్షన్ సినిమా ద్వారా చూపిస్తున్నామని చెప్పారు.
ఈ సినిమాను దాసరి నారాయణ రావు, సురేష్బాబు చూశారు. వారి డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా విడుదలవుతుందని పరుచూరి వెంకటేశ్వర రావు అన్నారు. నిస్వార్థంగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నామన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, రవీంద్రబాబును హీరోగా అనుకోలేదు. ప్రేమ్రాజ్ అనే వ్యక్తి ఇతన్ని హీరో చేయమని ఈ కథను తెచ్చాడు. కథ పరంగా చెప్పాలంటే... గాంధీ గ్రామాలను అభివృద్ధి చేయమని చెప్పారు.
నేడు గ్రామాలు పట్నందారి పట్టాయి. నగరంలోనే స్లమ్లు అధికంగా ఉన్నాయి. అలాంటి స్లమ్ జంక్షన్లో బతుకున్న ఓ యువకుడు అక్కడ ఉత్పన్నమైన సమస్యలను ఎలా పరిష్కరించాడు అన్నదే ఈ సినిమా ఇతివృత్తమని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. కథ సీరియస్గా ఎంటర్టైన్గా సాగుతుందని ఆయన చెప్పారు.
రవీంద్రనాథ్ మాట్లాడుతూ, హక్కులకోసం పోరాడి ఫ్యాక్టరీని సాధించుకున్న కార్మికులు 30 సంవత్సరాల తర్వాత పారిశ్రామిక వాడ తమకొద్దని పోరాటం సాగిస్తారు. మానవీయ కోణాన్ని ప్రేమకథతో చెబుతున్నామని రవీంద్రబాబు అన్నారు.