రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్రలో రాజా, సంజన హీరోహీరోయిన్లుగా నటించిన "సమర్థుడు" చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.
ఏడాదిన్నరపాటు షూటింగ్ను జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు ఆకుల సురేష్ పటేల్, ఎం. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఇది ప్రజాచిత్రం. కృష్ణంరాజు పోషించిన పాత్రచుట్టూనే కథ తిరుగుతుందన్నారు.
జనం కోసం పనిచేసే వ్యక్తిగా కె.కె. నటించారని, దానికి విరుద్ధంగా రాజా పాత్ర ఉంటుందని నిర్మాతలు వెల్లడించారు. రాజాకు కె.కె.కు మధ్య జరిగే వార్ ఏమిటి? అందులో ఎవరు సమర్థుడిగా గుర్తింపు పొందారనేదే ఈ సినిమా అని వారు చెప్పారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీన సమర్థుడిని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.