బ్రహ్మాజీ, రేఖాశ్రీ హీరోహీరోయిన్లుగా రత్నం కె.వి. దర్శకత్వంలో శ్రీశ్రీ కుమారస్వామి ఫిలిమ్స్ పతాకంపై ఎస్. బసవపున్నయ్య నిర్మిస్తోన్న "అబ్బో వాడా..!" చిత్రం విడుదలకు తుది మెరుగులు దిద్దుకుంటోంది.
గతనెల 26న హైదరాబాద్లో ఈ చిత్రం పాటలను సరస్వతి మ్యూజిక్ సంస్థ ద్వారా విడుదల చేశామని, చిత్రంలోని ఆరు పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత ఎస్. బసవపున్నయ్య తెలియజేశారు.
కమర్షియల్ అంశాలు జోడిస్తూ విభిన్నమైన కాన్సెప్ట్తో తీసిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంటుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. నిర్మాణానంతర పనులు పూర్తికావడంతో.. ఈ వారంలో సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన అన్నారు.
తాను చిత్ర నిర్మాణానికి కొత్త అయినప్పటికీ.. మంచి కమర్షియల్ సినిమాను అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందని బసవపున్నయ్య చెప్పారు. యూనిట్ అందరి సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చిత్రాన్ని చక్కగా తీశామని నిర్మాత వెల్లడించారు. తప్పకుండా అబ్బో.. వాడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
దర్శకుడు రత్నం కె.వి. మాట్లాడుతూ.. కుటుంబ నేపత్యంలో వినోదాత్మక కథనంతో తీస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ బాధ్యతాయుత పాత్రను పోషిస్తున్నారని చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని రత్నం అన్నారు.
బల్లేపల్లి మోహన్ అందించిన ఆరు పాటలకు ఆడియోపరంగా మంచి స్పందన లభిస్తోందని, ఇదే తరహాలో సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు.
కమర్షియల్ హంగులతో తెరపైకి రానున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కుమార స్వామి, సంగీతం: బల్లేపల్లి మోహన్, ఆర్ట్ డైరక్టర్: గోవింద, ప్రొడక్షన్ మేనేజర్: వెంకట్, నిర్మాత: ఎస్. బసవపున్నయ్య, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: రత్నం కె.వి.