యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ జంటగా డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "ఏక్నిరంజన్" సినిమా షూటింగ్ పూర్తయింది. ఆదిత్యారామ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యారామ్, ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రం అక్టోబర్ 29న తెరపైకి రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్యారామ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17తో ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందన్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నెలలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోను రెలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సినిమా చాలా వచ్చిందని, థాయ్లాండ్లో 20 రోజుల పాటు తీసిన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో మన భారతీయ ఫైటర్స్తో పాటు యూరప్ ఫైటర్స్ కూడా పాల్గొన్నారని నిర్మాత వివరాలందించారు.
అలాగే హాలీవుడ్ హీరో జాకీచాన్తో సోలో ఫైట్లో పాల్గొన్న ఫైటర్ కూడా ఈ క్లైమాక్స్లో పాల్గొనడం విశేషం. అత్యధిక వ్యయప్రయాసలతో చిత్రీకరించిన క్లైమాక్స్ ఏక్నిరంజన్కు హైలైట్ అవుతుందని ఆదిత్యారామ్ వెల్లడించారు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి తగినట్లుగా దర్శకుడు పూరి జగన్నాథ్ ఏక్నిరంజన్ని అద్భుతంగా మలిచారని నిర్మాత కితాబిచ్చారు.
ఇటు ప్రభాస్ కెరీర్లో, అటు పూరి కెరీర్లో ఏక్నిరంజన్ మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని ఆదిత్యారామ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తొలిసారిగా తెలుగులో హీరోయిన్గా నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, బ్రహ్మానందం, అలీలపై చేసిన కామెడీ ట్రాక్ సినిమాలో మరో హైలైట్ అవుతుందని ఆదిత్యారామ్ తెలియజేశారు.