అజయ్ హీరోగా, డి.ఎస్. కణ్ణన్ దర్శకత్వంలో విశాలాక్షి క్రియేషన్స్ పతాకంపై, పరుచూరి కోటేశ్వరరావు నిర్మిస్తున్న "సారాయి వీర్రాజు" చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. రచయిత రావిశాస్త్రి రాసిన "ఆరు సారాయి కథలు" ప్రేరణతో ఈ కథను తయారు చేశాను. 72 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది. 32 రోజులు నర్సీపట్నంలో షూటింగ్ చేశాం. మిగతా షూటింగ్ హైదరాబాద్, చెన్నై, దుబాయ్లలో చేశామన్నారు. థీమ్సాంగ్తో కలిపి మొత్తం పది పాటలుంటాయి.
శ్రీసాయి అద్భుతంగా మ్యూజిక్ అందించారని దర్శకుడు అన్నారు. ఇందులో హీరో పేరు సారాయి వీర్రాజు. సారాయి కాస్తుంటాడు. 60శాతం వెటకారం, 30శాతం వీరత్వం, ఒక శాతం నీతి నిజాయితీ, ధైర్యం కలిగిన వ్యక్తిగా ప్రేక్షకులకు కన్పిస్తాడు. స్క్రీన్ప్లే కొత్తగా ఉంటుంది. సహజత్వం కోసం నర్సీపట్నంకు చెందిన 180 మందిని ఇందులో నటింపజేశాం. సంభాషణలు కూడా సహజంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ.. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. నవంబర్ మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అజయ్ పాత్ర చిత్రణ ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తుందని, ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు.
రమ్య, నంబీశన్, మధులిక, ముమైత్ఖాన్, జోగినాయుడు, ధన్రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: విశ్వ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: సత్య.