తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తమిళ తాజా చిత్రం 'కుచేలన్'. ఈ చిత్రం "కథానాయకుడు" పేరుతో తెలుగులో వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మొత్తం 1200 ప్రింట్లతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే ఇది ఓ రికార్డు సృష్టించడం ఖాయమని ఆయన అన్నారు.
తమిళంలో "కుచేలన్"గా రూపుదిద్దుకున్న ఈ కథానాయకుడు తెలుగు వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తాడని చిత్ర దర్శకులు పి.వాసు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వైజయంతీ బేనర్లో చేయడం గర్వంగా ఉందని, రజనీతో ఈ బేనర్లో చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. 'కథానాయకుడు' మంచి చిత్రం అవుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. "కుచేలన్" తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ ఎప్పుడు అని వాసును అడిగితే.. రజనీ సార్తో మళ్ళీ సినిమా చేస్తున్నమాట నిజమే... కానీ అది ఎప్పుడనేది ఇంకా చెప్పలేను.
ఆగస్టులో "రోబో" షూటింగ్ ప్రారంభమౌతోంది. ఆ తర్వాత రజనీ కుమార్తె సౌందర్య రూపొందిస్తున్న "సుల్తాన్ ది వారియర్" విడుదల, వీటి గ్యాప్లోనా? లేక వీటి తర్వాత అనేది రజనీ సారే నిర్ణయించాలని చెప్పారు. అయితే కుచేలన్ రష్ చూశాక రజనీ సార్ తనను అభినందించారని పి. వాసు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే "కథానాయకుడు"లో రజనీ సరసన నయనతార నటిస్తుండగా, రజనీతో కలిసి ప్రతినాయకుడి పాత్రను జగపతి బాబు పోషిస్తున్నారు. ఇంకా మమతా మోహన్దాస్ మీనా తదితరులు మిగిలిన పాత్రల్లో నటించారు.
|