మధ్య ప్రదేశ్లో పవిత్ర నర్మదా నది ఒడ్డున ఉంది మహేశ్వర్. మహా శివుడు వెలసిన ప్రాంతం కాబట్టి దీనిని మహేశ్వర్గా పిలుస్తారు. రామాయణ కాలంలో దక్షిణ అవంతి రాజ్యానికి రాజధాని మహిషమతి. దీనికి రాజు కార్తవీర్యార్జున. కార్తవీర్యార్జునుడికి వేయి చేతులు ఉండేవి. అతను దత్తాత్రేయుడి పరమ భక్తుడు. రామాయణ, మహాభారతాల్లో మహశ్వర్ గురించి ప్రస్తావించబడింది.
హోల్కర్ వంశ రాణి రాజమాత అహల్యా దేవి బాయి మహేశ్వర్ను రాజధానిగా చేసుకుని పరిపాలించింది. మహేశ్వర్లో కోటతో పాటుగా భవంతులు, అనేక దేవాలయాలు, ధర్మసత్రాలు కట్టించింది. నర్మదా నదికి ఎదురుగా మహేశ్వర్ కోట ఉంది.
మహేశ్వర్లో శివుని రూపాలైన కాశీ విశ్వనాథ్, రాజరాజేశ్వర్, ఓంకారేశ్వర్, తిలబందేశ్వర్, కాళేశ్వరుడు. జలకంఠేశ్వరుడు, పండరినాథుడు పేరిట దేవాలయాలు రాణి అహల్యా దేవి నిర్మించింది. నర్మదా నది ఒడ్డున భక్తులు స్నానం చేసేందుకు వీలుగా పీష్వా, ఫాన్సే, అహల్యా ఘాట్లను రాణి అహల్యా ఏర్పాటుచేసింది.
|