ఇవ్వాళ్టి నుంచే వీరికి కూడా మధ్యాహ్న భోజనం
|
హైదరాబాదు శివార్లలోని బీహెచ్ఈఎల్ వద్దనున్న రామచంద్రాపురం ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఇంకా.. డీఎస్సీ నోటిఫికేషన్ను కూడా త్వరలో వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇప్పటిదాకా ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రమే ఈ పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 6, 7 తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వం విలీనం చేయడం వల్ల... అక్కడినుంచి వచ్చిన విద్యార్థులు ఈ పథకానికి దూరమయ్యారు.
ఈ మేరకు.... 6, 7 తరగతుల వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసినట్లైతే మిగతా విద్యార్థుల పట్ల వివక్ష చూపినట్లవుతుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లోని అన్ని తరగతుల వారికీ భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే...!
ఇదిలా ఉంటే... రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల... దేశంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోన్న ఏకైక రాష్ట్రం మనదే కానుంది. కాగా... ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో దాదాపు కోటిమంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.
