ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్ అవార్డును అందుకున్న "స్మైల్ పింకీ"కి ప్రేరణగా నిలిచిన ఉత్తరప్రదేశ్ బాలిక(8) పింకీకి స్కాలర్ షిప్ అందించేందుకు, ఇండోర్కు చెందిన ఓ విద్యా సంస్థ ముందుకొచ్చింది. ఆస్కార్ అవార్డు రావడంతోనే సంతోషంలో మునిగిపోయిన ఉత్తరప్రదేశ్ ప్రజానీకం.. పింకీకి స్కాలర్షిప్ ఇస్తామంటూ ఓ సంస్థ ముందుకు రావడం మరింత ఆనందాన్ని కలిగించింది.పింకీ తమ సంస్థలో మెడికల్, డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ రంగాలతో సహా మరే ఇతర రంగాలలో చదివినా... ఆ అమ్మాయికి పూర్తి ఉపకార వేతనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అరబిందో మెడికల్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ ప్రకటించింది.ఈ సందర్భంగా అరబిందో మెడికల్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ ఛైర్మన్ వినోద్ భండారీ మీడియాతో మాట్లాడుతూ... పింకీ కోర్సు ఫీజులతో పాటు.. పుస్తకాలు, ట్యూషన్ ఫీజులు, వసతి, భోజన ఖర్చులన్నింటినీ కూడా తామే భరిస్తామని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే... గ్రహణం మొర్రి సమస్యతో బాధపడే ఆ బాలిక సమాజంలో ఎదుర్కొనే అవమానాలు, బాధల ఇతివృత్తంతో రూపొందించిన డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ చిత్రం "స్మైల్ పింకీ" ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. మేగన్ మైలాన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీని యూపీలోని మీర్జాపూర్, వారణాసిలలో చిత్రీకరించారు. |