ప్రముఖ వ్యాపారి రాజారావు కుమారుడు నరేష్, రాజారావు దగ్గర కూలిపని చేసే రంగయ్య కుమారుడు సోము పదవ తరగతి ఊర్మిళానగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. రాజారావుకు ఆ స్కూల్లో మంచి పలుకుబడి ఉంది. అందువలన నరేష్ సరిగ్గా స్కూలుకు రాకపోయినా పరీక్షల్లో అసలు ఏమీ రాయకపోయినా కోపగించకుండా హాజరు వేస్తూ మార్కులు కూడా అవకాశాన్ని బట్టి వేస్తూ పాస్ చేసే వారు. అందువలన నరేష్ అందరితో తగవులు పెట్టుకొని అల్లరిగా తిరిగేవాడు.
సోము స్కూలు వదలగానే తండ్రి దగ్గరకు వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళవలసిన సరుకులు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళేవాడు. ఇంటి దగ్గర సోమూ పాఠాలు అన్నీ చక్కగా చదువుకొని, నోట్సులు రాసుకొని రాని ప్రశ్నలను మరింత శ్రద్ధగా చదివి ఏ రోజు వర్క్ ఆ రోజుకే పూర్తిచేసేవాడు. పదవ తరగతి పరీక్షలంటే భయంతో మరింత శ్రద్ధగా చదివేవాడు. పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి.
‘ప్రతి విద్యార్ధి జీవితానికీ చక్కని మలుపునిచ్చేది ఈ పదవ తరగతి పరీక్షలే’. అందువలన సోము రాత్రంతా మేల్కొని ప్రతి పాఠాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి తన మెదడులో నిక్షిప్తం చేసుకునేవాడు. కొడుకు కృషిని చూసి తల్లి, తండ్రి కూడా నిద్రపోకుండా అతనితోపాటు మేల్కొని తోడుగా ఉండేవారు. రాజారావు తన కుమారుడు ‘స్టేట్ ఫస్ట్ క్లాస్’ రావాలని, దానికోసం రకరకాల దారులు అన్వేషించి, లంచం ఇచ్చి చివరకు ప్రశ్నాపత్రాలు సంపాదించాడు.
|