జాతీయ పతాకం రెపరెపలాడే వరకు ఒక్క తెలుగు వారే కాకుండా.. జాతియావత్తూ స్మరించుకోదగిన మహాపురుషుల్లో పింగళి వెంకయ్య ఒకరు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు (ప్రస్తుతం మొవ్వ మండలములో ఉంది) గ్రామంలో హనుమంతరాయుడు-వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లిలో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది.
ఈయన ఉన్నత పాఠశాల పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేసేందుకు కొలంబో వెళ్లాడు. 19 ఏళ్ల ప్రాయంలోనే దక్షిణాఫ్రికాలో జరుగిన బోయర్ యుద్ధములో పాల్గొన్న దేశభక్తుడు. దక్షిణాఫ్రికాలోనే మహాత్మా గాంధీని కలిసిన తెలుగు యువనేత. వీరిమధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు సాగింది. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన గురించి చర్చలు జరిపారు. 1916లో "భారతదేశానికొక జాతీయ జెండా" అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు.
|