గృహ రుణాలు తీసుకోవాలని అనుకునేవారు ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు కొన్నిటి నుంచి ఇంటి ఖరీదులో పెద్ద మొత్తాన్నే రుణంగా తీసుకోవచ్చని దేశీయ బ్యాంకింగ్ వర్గాలు అంటున్నాయి.
దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)తో సహా మరి కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్బిలు) ఇంటి రుణం పొందేందుకు కావలసిన మార్జిన్ మనీని తగ్గించాయి. ఇలాంటి సౌకర్యాన్ని కల్పిస్తున్న ఇతర బ్యాంకులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి), పూనా కేంద్రంగాకల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం) కూడా ఉన్నాయి.
ఎస్బీఐ తాను ఇప్పుడు అమలు జరుపుతున్న ప్రత్యేక గృహ రుణ పథకంలో భాగంగా ఇంటి రుణాలకు కావలసిన మార్జిన్ మనీని పూర్వపు 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దీనిని 15 శాతానికి తగ్గించింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా దీనిని 15 శాతానికి తగ్గించింది. పిఎన్బి, బిఒఎం రెండూ ఇంతకుముందు 25 శాతం మార్జిన్ మనీ ఉండాలని రుణ గ్రహీతలను కోరేవి. కాని ఇప్పుడు మార్జిన్ మనీపై నిబంధనలను సడలించింది.
ఇంటి రుణాలకుగాను మార్జిన్ మనీని పిఎన్ బి 15 రోజుల క్రితం సవరించగా ఎస్బిఐ దాదాపు నెల క్రితమే తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అయితే రెండు నెలల క్రితం ఈ మార్జిన్ మనీని తగ్గించింది.
మార్జిన్ మనీ తగ్గింపు కారణంగా పిఎన్బి ఖాతాదారుడు రూ. 20 లక్షలు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేయడానికి రూ. 3 లక్షల మేరకు మాత్రమే సొంత డబ్బును చెల్లించవలసి ఉంటుంది. ఇదే గతంలో ఖాతాదారుడు రూ. 5 లక్షలు చెల్లించవలసి వచ్చేది.
ఇదే ధరకు ఇంటిని కొనుగోలు చేయడానికి కస్టమర్ ఎస్బిఐ విషయంలో రూ. 4 లక్షలు, బిఒఎం విషయంలో రూ. 3 లక్షలు చెల్లించవలసి ఉంటుంది.
ఇంటి రుణాలకుగాను కేటాయించిన మొత్తాన్ని ఎస్బిఐ జూన్ నెలాఖరుకు రూ. 3450 కోట్ల మేరకు పెంచి రూ. 57,513 కోట్లకు హెచ్చించింది. బిఒఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు రూ. 500 కోట్ల మేరకు ఇంటి రుణాలను పంపిణీ చేసింది.
ఇదిలావుండగా ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న ప్రముఖ గృహ రుణ సహాయ సంస్థలలో హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డిఎఫ్సి) ఇంటి ధరలో గరిష్ఠంగా 85 శాతం వరకు రుణంగా ఇస్తుంది.
అదే మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ 80 శాతం మేరకు రుణాలను అందజేస్తున్నది. అయితే ఇంటి రుణానికి కావలసిన మార్జిన్ మనీని ఈ రెండు బ్యాంకులు ఇటీవల తగ్గించాయా అనేది నిర్థారణ కావలసి ఉన్నది.
ఇలా పలు బ్యాంకులు గృహ రుణాలను సులభరీతిలో అందివ్వడంతో ప్రజలు తమ స్వంత ఇంటి కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో గృహ నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుందని రియల్టర్లు ఆశాభావం వ్యక్తం చేశారు.