శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (12:25 IST)

లక్ష్మీపార్వతి కిచెన్ కేబినెట్.. వెన్నుపోటుకు గురైంది చంద్రబాబే.. కుసుమ రావు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడవడం కంటే... నిజంగా చెప్పాలంటే వెన్నుపోటుకు గురైంది చంద్రబాబేనని బసవతారకం స్నేహితురాలు డాక్టర్ కుసుమ రావు తెలిపారు. అప్పట్లో టీడీపీకి ఛరిష్మా మొత్తం ఎన్టీఆరేనని... కాకపోతే అడ్మినిస్ట్రేషన్ మొత్తం చంద్రబాబే చూసుకునేవారని తెలిపారు. ఎన్టీఆర్‌కు తర్వాత పార్టీని సమర్థవంతంగా నడిపింది చంద్రబాబేనని.. పార్టీ కోసం చాలా కష్టపడ్డారని చెప్పారు. 
 
తెల్లవారుజామున 5 గంటలకల్లా రాకపోతే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు కబురు వచ్చేదని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఎన్నో గందరగోళాలను సమర్థవంతంగా పరిష్కరించింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ప్రతి కార్యకర్త పేరు చంద్రబాబుకు తెలుసని చెప్పారు. ఎన్టీఆర్‌కు ఏ ఆలోచన వస్తే అది జరిగిపోవాల్సిందేనని... అయితే, ఎలాంటి సమస్యలు వచ్చినా, దాన్నంతా సరిదిద్దే బాధ్యత చంద్రబాబే చూసుకునేవారని కుసుమ తెలిపారు. 
 
సమస్యలను ఎన్టీఆర్ పిల్లలు కానీ, మరో అల్లుడు కానీ సరిదిద్దే పరిస్థితి లేదని చెప్పారు. ఏ టు జెడ్ చంద్రబాబే చూసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. అలాంటి చంద్రబాబును లక్ష్మీపార్వతి సూచన మేరకు అన్ని పదవులకు ఎన్టీఆర్ దూరం పెట్టారని చెప్పారు. 
 
జీవిత చరిత్ర రాస్తానని చెప్పి.. నెలపాటు కామ్‌గా వుండి.. ఆపై లక్ష్మీ పార్వతి పూర్తిస్థాయి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. లక్ష్మీపార్వతి వందశాతం రాజకీయాల్లో వున్నారని.. కిచెన్ క్యాబినెట్ పెట్టుకుని.. ఎన్టీఆర్‌ను తన చేతుల్లో పెట్టుకుని పార్టీ వ్యవహారాన్ని నడిపిందని లక్ష్మీ పార్వతిపై కుసుమ రావు చెప్పారు. రామ్ గోపాల్ వర్మ తొలుత మంచి సినిమాలు తీసేవారని.. ఇప్పుడు వివాదానికి కొని తెచ్చుకుంటున్నారని.. అందుకు రకరకాల సినిమాలు తీస్తున్నారని.. ఇందులో భాగమే లక్ష్మీస్ ఎన్టీఆర్ అని వెల్లడించారు.