1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (15:22 IST)

వ్యాధి నిరోధక శక్తిని మందులతో పెంచుకోవచ్చా?

ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్ బారినపడకుండా ఉండాలంటే శరీరంలో రోగ నిరోధకశక్తి (ఇమ్యూనిటీ పవర్)ని పెంచుకోవాలని వైద్యులు పదేపదే సలహా ఇస్తున్నారు. ఇంతవరకుబాగానేవుంది. అయితే, ఈ ఇమ్యూనిటీ పవర్‌ను సహజసిద్ధమై పండ్లు ఆరగించడం ద్వారా పెంచుకోవచ్చు. కానీ, మందుల ద్వారా పెంచుకోవచ్చా? అన్నది ఇపుడు అనేక మంది సందేహం. ఈ మందుల అవసరం ఎవరికి? ఎంతమేరకు? అనే విషయాన్ని తెలుసుకుందాం. 
 
ఆరోగ్యకరమైన జీవనశైలిని గడిపే ప్రతి ఒక్కరికీ వ్యాధినిరోధకశక్తి మెరుగ్గానే ఉంటుంది. కాబట్టి వీరికి అదనంగా మందులు వాడవలసిన అవసరం లేదు. అయితే పిల్లల్లో, వృద్ధుల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. 
 
అలాగే కేన్సర్‌ చికిత్సలు తీసుకుంటున్నవారు, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటీస్‌తో బాధపడుతూ స్టెరాయిడ్లు వాడుతున్న వారు, మధుమేహులు, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, ఊపిరితిత్తుల రుగ్మతలు కలిగి ఉన్నవారు, వ్యాధినిరోధక శక్తిని తగ్గించే మందులు వాడే వారిలో రోగనిరోధకశక్తి మరింత బలహీనంగా ఉంటుంది. 
 
కాబట్టి వీళ్లు వైద్యుల సూచన మేరకు రోగనిరోధకశక్తిని పెంచే ఇమ్యూన్‌ బూస్టర్స్‌ వాడడం ద్వారా కొంతమేరకు కరోనా నుంచి రక్షణ పొందవచ్చు. జీర్ణశక్తి, శరీర సామర్థ్యం కలిగి ఉండి, సమ్మిళిత పౌష్టికాహారం తీసుకుంటూ, ఒత్తిడి తక్కువగా ఉండే ఆరోగ్యవంతులకు ఈ మందులతో అదనంగా ప్రయోజనం కలగదు.