గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (11:09 IST)

చీఫ్ జస్టీస్ దీపక్ మిశ్రాపై అభిశంసన : 60 మంది ఎంపీలు సంతకం?

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీతో ఎన్‌సీపీ, స

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీతో ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
 
ఈ విషయంపై శుక్రవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ఛాంబర్‌లో ఆయా పార్టీల నేతలు సమావేశమై చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడును కలిసి నోటీసు ఇచ్చారు. ఈ నోటీసుపై ఆయా పార్టీలకు చెందిన 60 మంది రాజ్యసభ సభ్యులు సంతకం చేసినట్టు తెలుస్తోంది. 
 
కాగా, కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు కోర్టు పాలన వ్యవస్థపై అభ్యంతరాలు తెలుపుతూ దేశ చరిత్రలోనే మొదటిసారి నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చిన విషయం విదితమే. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసుల కేటాయింపులపై వారు పలు ఆరోపణలు చేయడంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేస్తోంది. 
 
దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులపై కూడా బార్ కౌన్సిల్ మండిపడింది కూడా. దీపక్ మిశ్రా సారథ్యంలో జరిగే కేసుల విచారణకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సీనియర్ న్యాయవాదులుగా ఉండేవారు వాదించడానికి వీల్లేదంటూ బార్ కౌన్సిల్ ఓ తీర్మానం కూడా చేసింది. ఈ నేపథ్యంలో చీఫ్ జస్టీస్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం.