బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2017 (11:43 IST)

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కే: సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

సుప్రీంకోర్టు మరో చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఇటీవలే ముస్లిం వివాహ సంప్రదాయంలో ఉండే ట్రిపుల్ తలాక్ చెల్లదంటూ ఐదు మతాలకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించి

సుప్రీంకోర్టు మరో చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఇటీవలే ముస్లిం వివాహ సంప్రదాయంలో ఉండే ట్రిపుల్ తలాక్ చెల్లదంటూ ఐదు మతాలకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఇపుడు 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మరో చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 
 
భారత రాజ్యాంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగ్దీష్ సింగ్ ఖేహర్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోపత్య ప్రాథమిక హక్కేనంటూ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది.
 
గోప్యతపై తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సీజేఐ జగ్దీష్ సింగ్ ఖేహర్‌, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్‌, జే చలమేశ్వర్‌, రోహింటన్‌ నారీమన్‌, ఆర్కే అగర్వాల్‌, సంజయ్‌ కిషన్‌ కౌల్‌, ఎస్‌ఏ బొబ్డే, ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, ఏఎమ్‌ సప్రేలు ఉన్నారు. మూడు వారాల్లో ఆరు రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం ఆగష్టు 2న తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే.
 
సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో ఆధార్‌ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రజా బాహుళ్యంలో గోప్యత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయని ఆగస్టు 2న పేర్కొంది.
 
ప్రస్తుతం ఆధార్‌ కార్డు ఆధారంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఆధార్‌ కార్డు వ్యక్తిగత వివరాలను తెలుపుతుంది కనుక సుప్రీం కోర్టు తీర్పుతో ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డును జతచేయాలా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ పీటముడిపై సంగ్ధితను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోప్యత అనే ప్రాథమిక హక్కును ఆధార్‌ కార్డు ఉల్లంఘిస్తుందా? అనే దానిపై విచారణ జరిపి తీర్పు చెప్పనుంది.
 
దీనిపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ.. 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు కేంద్రప్రభుత్వానికి శరాఘాతమేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక హక్కులను కాలరాసే హక్కు పార్లమెంటుకు లేదని ధర్మాసనం స్పష్టం చేయడం కేంద్ర ప్రభుత్వాన్ని షాక్‌కు గురి చేస్తుందన్నారు. 
 
ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను న్యాయస్థానాలు పరిరక్షిస్తున్నాయని చెప్పేందుకు ఈ తీర్పును ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి అర్థమవుతుందని తాను భావిస్తున్నానని ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు.