శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (14:45 IST)

ఎన్డీయేతో ఎందుకు తెగదెంపులు చేసుకున్నామంటే : చంద్రబాబు

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకోవడానికి గల కారణాలను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చారు.

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకోవడానికి గల కారణాలను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చారు. 
 
ఆంధ్రప్రదేశ్ హక్కులను కాలరాసి ఐదు కోట్ల ఆంధ్రులకు అన్యాయం చేసిన ఎన్డీయే కూటమి నుంచి నేడు వైదొలుగుతున్నాం. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయ తీసుకున్నాం అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
 
ఇదే అంశాన్ని ఆయన శుక్రవారం అసెంబ్లీ సమావేశంలోనూ స్పష్టంచేశారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఎన్డీయే నుంచి బయటికొచ్చినట్లు అసెంబ్లీలో చెప్పారు. రాష్ట్రం కోసమే కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు. మన నిర్ణయంపై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. 
 
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విషయంలోనూ రాజీ పడేది లేదని ఆయన మరోసారి స్పష్టంచేశారు. ఏపీ కష్టాలను కేంద్రం పట్టించుకోలేదని, నాలుగు బడ్జెట్‌లలోనూ ఏపీకి అన్యాయం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.
 
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని అన్నారు. విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని ఆయన నిలదీశారు. పైగా, 14వ ఆర్థిక సంఘం ఇవ్వొద్దని చెప్పిందని అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని తాము చెప్పలేదనీ ఆర్థిక సంఘం సభ్యులే స్పష్టం చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.