శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (10:33 IST)

శనివారమే హనుమజ్జయంతి: సాయంత్రం ఆరు గంటలకు ఇలా చేయండి..

చైత్రశుద్ధ పౌర్ణమిని హనుమజ్జయంతిగా జరుపుకుంటాం. అదీ శనివారం (మార్చి 31-2018) పూట హనుమజ్జయంతి రావడం శుభదాయకం. అలాగే చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమజ్జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో

చైత్రశుద్ధ పౌర్ణమిని హనుమజ్జయంతిగా జరుపుకుంటాం. అదీ శనివారం (మార్చి 31-2018) పూట హనుమజ్జయంతి రావడం శుభదాయకం. అలాగే చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమజ్జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపమెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. 
 
హనుమజ్జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమత్కకళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసే భక్తులు, పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. 
 
పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు. పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా "ఓం ఆంజనేయాయ నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. 
 
పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యానశ్లోకములు, హనుమాన్‌చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.
 
ఇదిలా ఉంటే.. హనుమాన్ జయంతికి భాగ్యనగరం ముస్తాబైంది. జయంతి ఉత్సవాల్లో భాగంగా వీరహనుమాన్ శోభయాత్ర జరగనుంది. ప్రత్యేక పూజల తర్వాత గౌలి గూడ రామమందిరం నుంచి ప్రారంభమయ్యే శోభయాత్ర, పుత్లీబౌలీ చౌరస్తా, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసి క్రాస్ రోడ్, ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్‌లోని తాడ్ బండ్ వీరాంజనేయస్వామి ఆలయానికి చేరుకోనుంది.
 
దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కొన్ని రూట్లల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఇదే తరహాలో ఏపీలోనూ ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.