శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 7 జూన్ 2019 (22:13 IST)

దైవానికి దగ్గర కావడానికి అలా చేయవలసిందేనా?

అంతఃచేతనలో పూర్తిగా పరమాత్మ స్వరూపం నిండిన తరువాత కూడా మహర్షులు, యోగులు, సిద్దులు మహనీయులైన మన పూర్వికులు స్వధర్మాచరణను విడిచి పెట్టలేదు. ఆధునిక కాలంలో ఈ ధర్మాచరణ పట్ల సరైన అవగాహన లేక, అలా అవగాహన కల్పించేవారు లేక పొందాల్సిన జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. 
 
నవవిధ భక్తులలో మొదటిది అర్చన. కొందరు పరమాత్మ గుణ గాన సంకీర్తనాన్ని ఎంచుకుని తరించారు. ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకున్న ఆ మార్గాలన్నింటి లక్ష్యం పరమాత్మని చేరుకోవడమే. మనసులో కల్మషం నింపుకుని ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు. మనసు నిర్మలంగా సర్వ భూత హితకారియై ఉన్నప్పుడు, నిరంతరం పరమాత్మలో లీనమై చరించేటప్పుడు ఏలాంటి పూజలు చేయకపోయినా ఫరవాలేదు. ఆ స్థితికి చేరుకోవడం చాలా కష్టం. 
 
కానీ... అలా చేరుకున్నప్పటికీ స్వధర్మానుష్టానాన్ని విడిచిపెట్టుకోవడం మాత్రం ఏ మాత్రం మంచిది కాదు. మీరు చేసే పూజలు, పునస్కారాలు మిమ్మల్ని ధర్మమార్గంలో పట్టి నిలిపి ఉంచుతాయి. ధార్మిక చింతనల వలన మీ మదిలో చెడు ఆలోచనలు రావు. ఆ నిష్ట చెదరకుండా ఎప్పటికి నిలచి ఉండడానికి ఆధ్యాత్మిక దివ్య సాధనలో మీరు మరింతగా పురోగమించడానికి పరిపూర్ణంగా పరమాత్మ సాక్షాత్కారం కలగడానికి ఆ పూజలు ఖచ్చితంగా దోహదపడతాయి. మనసు పరమాత్మలో పూర్తిగా లీనమై ఉన్నప్పుడు మాట కూడా మంత్రం అవుతుంది. దృష్టి ప్రాపంచిక విషయాలపై ఉన్నప్పుడు మంత్రం కూడా మాట లాగే వినపడుతుంది. ఈ రెండిటికి మధ్య భేదాన్ని గుర్తించగలిగే స్థాయి పరిణతి చాలా అవసరం.