నందమూరి జానకీరాం దుర్మరణానికి రాంగ్రూట్... అతివేగమే కారణం!
నల్గొండ జిల్లాలో నందమూరి జానకీరాం దుర్మరణానికి ట్రాక్టర్ డ్రైవర్ రాంగ్ రూట్లో రావడంతో పాటు.. కారు అతివేగంగా రావడమేనని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ జిల్లాలోని జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత నందమూరి హరికృష్ణ తనయుడు, సినీ నిర్మాత నందమూరి జానకీరామ్ తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. ఈయన వయస్సు 38 సంవత్సరాలు.
జాతీయ రహదారిపై ఆకుపాముల శివారులో బైపాస్ రోడ్డులో గ్రామంలోకి వెళ్లేందుకు క్రాసింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. రహదారికి ఇరువైపులా దాదాపు 100 నుంచి 120 కి.మీ వేగంతో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రాంతంలో తరచు వాహనాలు రాంగ్రూట్లో క్రాసింగ్ చేస్తూ జాతీయ రహదారిపైకి వస్తుంటాయి. ఈ తరుణంలో ఆదమరిస్తే ప్రమాదం జరగక మానదు.
కాగా, రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో జానకిరామ్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది. పోస్ట్మార్టం ప్రాధమిక నివేదికను వైద్యులు వెల్లడించారు. జానకిరామ్ తల, ఛాతి, కుడిచెయ్యి, కడుపులో గాయాలు అయినట్లు వైద్యులు తెలిపారు.