శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Modified: శనివారం, 6 ఏప్రియల్ 2019 (22:17 IST)

శభాష్ లక్ష్మీనారాయణ... జనసేన మేనిఫెస్టోను బాండ్ పేపరుపై... విశాఖలో తిరుగులేదా?

సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వివి లక్ష్మీనారాయణ తను ప్రకటించినట్లుగానే హామీలన్నిటినీ ఓ బాండ్ పేపరుపై పెట్టి సంతకం చేశారు. జనసేన తరపున విశాఖపట్టణం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణ ఇంటింటికి తిరుగుతూ జనసేన గెలిస్తే ఏం చేస్తామోనన్న విషయాలను విపులీకరించి చెపుతున్నారు. 
 
కేవలం చెప్పడమే కాదు... ఆ హామీలను నెరవేర్చి తీరుతామనీ, మాట తప్పకుండా ప్రజలకు జవాబుదారీతనంగా వుండాలని, అందుకే బాండ్ పేపరుపై జనసేన మ్యానిఫెస్టో హామీలన్నిటినీ విశాఖ ప్రజల ముందు వుంచుతున్నట్లు తెలిపారు. ఎంపీగా గెలిస్తే తను ప్రకటించిన విశాఖపట్టణం స్పెషల్ మ్యానిఫెస్టోలో తెలిపిన హామీలన్నిటినీ నెరవేరుస్తానని వెల్లడించారు. దీనితో పాటు రీచ్ యువర్ ఎంపీ పేరిట మొబైల్ యాప్‌తో విశాఖవాసులకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు. 
 
విశాఖను అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ప్రతి మూడు నెలలకోసారి మేనిఫెస్టో అమలు తీరును వివరిస్తూ ప్రజల ముందు ఉంచుతానని పేర్కొన్నారు. మొత్తమ్మీద ప్రజలకిచ్చే హామీలు నీటిమూటలుగా మారుతున్న సమయంలో లక్ష్మీనారాయణ అనుసరిస్తున్న విధానాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. విశాఖలో జనసేన గెలుపు ఖాయం అంటున్నారు.