గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (16:27 IST)

జగన్ - షర్మిల - విజయమ్మలు పందికొక్కులా? యామిని తీవ్ర వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యామినేని సాధినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి వైఎస్. విజయలక్ష్మి, చెల్లి వైఎస్. షర్మిలు పందికొక్కుల్లా రాష్ట్రంపై పడ్డారని వ్యాఖ్యానించారు. 
 
ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ గత చరిత్రను తిరగేస్తే అవినీతే కనిపిస్తోందన్నారు. విజయమ్మ, షర్మిల రాష్ట్రంలో పర్యటించి ఉంటే టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించేదన్నారు. సీమ నీళ్లు తాగి ఉంటే ప్రాజెక్టులపై వీరు మాట్లాడేవారు కాదని చెప్పారు. 
 
వైకాపా ఎన్నికల గుర్తు ఫ్యాన్ అని.. ఆ ఫ్యాన్‌లోని మూడు రెక్కలు ఉంటాయన్నారు. ఆ రెక్కలో ఒక రెక్క జగన్, రెండో రెక్క నరేంద్ర మోడీ, మూడో రెక్క కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. సొంత జిల్లాలోని కడప స్టీల్ ప్లాంట్‌పై మోడీని జగన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. మహిళల నుదిటిబొట్టును తుడిచేసిన వైఎస్ కుటుంబానికి... తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న పసుపు-కుంకుమ విలువ ఏం తెలుస్తుందని అన్నారు.
 
ఈనెల 11వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోతుందని ఆమె జోస్యం చెప్పారు. అందుకే కుట్రలు కుతంత్రాలు చేసేందుకు జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగానికి రెండు రోజుల విశ్రాంతినిచ్చారని ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు.