శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (10:19 IST)

కందుకూరులో వ్యభిచారం... మైనర్ బాలికలతో విటులకు ఎర?

ప్రకాశం జిల్లా కందుకూరులో వ్యభిచారగుట్టును పోలీసులు రట్టు చేశారు. మైనర్ బాలికలను ఎరగా వేసి విటులను ఆకర్షిస్తూ, రెండు చేతులా సంపాదిస్తున్న ఓ వ్యభిచార ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత జూలై నెలలో నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన బాలికతో మాధవి అనే మహిళ కందుకూరు - సింగరాయకొండ రోడ్డులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం చేయించింది. ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు బాలికను రక్షించి నలుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. 
 
నిర్వాహకురాలు మాధవి విజయవాడలో కూడా వ్యభిచార గృహాలను నడుపుతున్నట్లు గుర్తించారు. వ్యభిచార కూపంలో చిక్కుకున్న బాధితురాలు మైనర్‌ కావడంతో దిశ చట్టం కింద పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. దీంతో సదరు బాలికతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని ప్రస్తుతం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.  
 
పోన్‌కాల్స్, బ్యాంకు లావాదేవీలు, పోన్‌పే వంటి ఆధారాలను సేకరించి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిలో కాట్రగడ్డ శివకుమార్, ఉన్నం నవీన్, అరవింద్, సయ్యద్‌ సల్మాన్, కసిరెడ్డి బ్రహ్మారెడ్డి, దేవప్రకాశ్, కోమట్ల ఏడుకొండలు, గొంది వంశీకృష్ణ చౌదరిలు ఉన్నారు. 
 
వీరంతా బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీదేవి మాట్లాడుతూ వ్యభిచార కూపాల్లో చిక్కుకున్న బాలికలను బాలసదన్‌లో ఉంచి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి జీవితంపై భరోసా కల్పిస్తామని చెప్పారు.