శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (16:35 IST)

నిన్ను రెండో పెళ్లి చేస్కుంటానని పట్టుబట్టిన ప్రియుడు... మట్టుబెట్టిన ప్రియురాలు...

కొద్ది రోజుల క్రితం జరిగిన గద్వాలకు చెందిన శ్రీనివాసులు హత్య ఉదంతం కొలిక్కి వచ్చింది. పోలీసులు దర్యాప్తు సాగించి ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. ఈ కేసులో ముగ్గురిని ప్రధాన నిందితులుగా అరెస్ట్ చేసారు. ప్రకాశం జిల్లాలో కొద్ది రోజుల క్రితం శ్రీనివాసులు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిందితులను పట్టుకున్నాక మంగళవారం పోలీసులు కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. 
 
ఈ దారుణంలో పాలుపంచుకున్నది స్వాతి, తన తండ్రి మరియు ఆమె సోదరుడు. శ్రీనివాసులుకి, ప్రియురాలు స్వాతికి ఇద్దరికీ కుటుంబాలు ఉన్నాయి. అయితే స్వాతిని శ్రీనివాసులు కూడా పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. కానీ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఆ పెళ్లి ఇష్టం లేని స్వాతి అతడిని హతమార్చాలనుకుంది. తండ్రి, సోదరుడితో కలిసి ప్రణాళిక సిద్ధం చేసింది. 
 
శనివారం తనతోపాటు మార్కాపురం రమ్మని పిలిచింది. శ్రీనివాసులు అక్కడికి వెళ్లాడు. స్వాతి తండ్రి వెంకట్‌రెడ్డి, సోదరుడు చక్రపాణిరెడ్డి శ్రీనివాసులుని ఇంటి పైఅంతస్తులోకి తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసారు. పట్టుబడకుండా ఉండటానికి శవాన్ని నల్లమల అడవులలోకి తీసుకువెళ్లి కాల్చేశారు. 
 
శ్రీనివాసులు భార్య ఈ నెల 18న గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఫోన్ కాల్‌ల డేటా ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి కాల్చిన మృతదేహాన్ని వైద్యుల సహాయంతో పరిశీలించారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.