గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 నవంబరు 2019 (09:36 IST)

పింఛన్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాం... చేతిలో కొడవలితో మహిళ హల్‌చల్

ఇటీవలికాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై జరిగే భౌతికదాడులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళా తాహసిల్దారుపై ఓ రైతు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 
ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కూడేరు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన కొందరు వ్యక్తులు తమకు పింఛన్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసి తగులబెడతామని, కొడవలితో నరికి చంపుతామంటూ పంచాయతీ కార్యదర్శిని బెదిరించాడు. 
 
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కూడేరు ఎంపీడీవో కార్యాలయానికి కొందరు పింఛనుదారులు వెళ్లారు. తమకు ఈ నెల పింఛన్ ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీశారు. ఈ నెల ఇవ్వడానికి లేదని, వచ్చే నెల నుంచి ఇస్తామని ఆయన సమాధానం ఇచ్చారు. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వారు వచ్చే నెల కనుక పింఛన్ రాకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని పెన్నోబులేశు, శివమ్మతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
శివమ్మ కార్యాలయంలోకి వెళ్లిన సమయంలో ఆమె చేతిలో కొడవలి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శివమ్మ కొడవలితో అక్కడికి ఎందుకు వెళ్లిందన్న విషయంపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కార్యదర్శి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.