ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 మే 2018 (14:40 IST)

పరిటాల రవి ఆప్తుడు చమన్ హఠాన్మరణం : స్పృహ కోల్పోయిన మంత్రి సునీత

దివంగత నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 58 ఏళ్లు. పరిటాల రవి, సునీతల కుమార్తె స్నేహలత వివాహం నేపథ్యంలో, గత మూడు రోజులుగా ఆయన వెంకటాపురంలోనే ఉన్నారు.

దివంగత నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడు చమన్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 58 ఏళ్లు. పరిటాల రవి, సునీతల కుమార్తె స్నేహలత వివాహం నేపథ్యంలో, గత మూడు రోజులుగా ఆయన వెంకటాపురంలోనే ఉన్నారు. పెళ్లి పనులను పర్యవేక్షించారు. ఈ ఉదయం ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
అయితే, తమకు అత్యంత ఆప్తుడైన చమన్ మరణంతో పరిటాల కుటుంబం షాక్‌కు గురైంది. ఆసుపత్రిలో చమన్ మృతదేహాన్ని చూడగానే ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్‌లు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీరామ్‌ను పట్టుకుని సునీత బిగ్గరగా రోదించారు. ఆమెను నిలువరించడం ఎవరితరం కాలేదు. దీంతో ఆమె స్పృహ కోల్పోయి, కిందకు పడిపోయారు. వెంటనే స్పందించిన డాక్టర్లు ఆమెకు చికిత్సను అందించారు. మరోవైపు, చమన్ మరణంతో అనంతపురం టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. మంచి మనిషిని కోల్పోయామని జిల్లా నేతలు ఆవేదనను వ్యక్తంచేశారు. 
 
కాగా, పరిటాల రవికి అత్యంత ఆప్తుడుగా ఉన్న చమన్... గత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు ఎనిమిదేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2012లో అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడం, పరిటాల సునీత మంత్రి కావడం జరిగాయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం నుంచి ఆయన జడ్పీటీసీగా గెలుపొందారు. ఆ తర్వాత ఒక ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు అనంతపురం జడ్పీటీసీగా పని చేస్తూ, టీడీపీలో క్రియాశీలక నేతగా వ్యవహరిస్తూ వస్తున్నారు.