గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (13:29 IST)

పాపం వెంకయ్య : ప్రమోషన్ ఇచ్చారో.. పనిష్మెంట్ ఇచ్చారో.. దేవుడికే తెలియాలి.. అధ్యక్షా...

ఏపీ శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై మండిపడ్డారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన మనసులోని అక్రోశాన్ని వెళ్ళగక్కారు. పనిలోపనిగా ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడుని గుర్తుచేశారు. 
 
సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దక్షిణాది నుంచి ఒకే ఒక కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి వెంకయ్య నాయుడు. ఆయన అన్ని రాష్ట్రాలకు తిరిగేవాడు. ఆయన్ను కూడా పదవి నుంచి తీసేసి ఉప రాష్ట్రపతిని చేసేశారు. ఎంత అసూయ అధ్యక్షా... పాపం వెంకయ్య నాయుడు. ఆయనకు ప్రమోషన్ ఇచ్చారో.. పనిష్మెంట్ ఇచ్చారో ఆ దేవుడుకే తెలియాలి. దక్షిణాది నుంచి ఒక్కరైనా కేంద్రమంత్రిగా ఉన్నారా? దత్తాత్రేయ ఉంటే ఆయన్ను తీసేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఉత్తరాది వ్యక్తిగా ప్రధాని పదవి ఇస్తే, దక్షిణాది వ్యక్తికి రాష్ట్రపతి పదవి ఇచ్చే సమన్యాయం పాటించేవారని గుర్తుచేశారు. 
 
కానీ, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ పాలకులు మాత్రం అసూయ, అహంతో పాలన చేస్తున్నారన్నారు. కొత్త రాష్ట్రం వస్తే మద్దతు ఇవ్వాల్సింది పోయి కేసులతో వేధించుకుని తింటున్నారని మండిపడ్డారు. అలాగే, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఏపీకి అన్నీ ఇచ్చామని చెప్పడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.