శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (18:17 IST)

బాణాసంచా బాధితులకు చంద్రబాబు ఓదార్పు.. రూ.3 లక్షల పరిహారం.. ఎంఆర్వో సస్పెండ్

కొత్తపల్లిలో జరిగిన బాణాసంచా పేలుడు మృతులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం పరామర్శించారు. ఆతర్వాత మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. కాగా, ప్రమాదం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి స్థానిక ఎమ్మార్వోను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. 
 
తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం వాకతిప్పలో అక్రమ బాణాసంచా ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం పేలుడు సంభవించిన విషయం తెల్సిందే. ఈ పేలుడులో 13 మంది మృత్యువాతపడగా, మంగళవారానికి ఈ సంఖ్య 16కు చేరిన విషయం తేల్సిందే. 
 
ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పరామర్శించారు. అలాగే క్షతగాత్రుల కుటుంబాలను కూడా ఆయన ఓదార్చారు. ఇందుకోసం ఆయన గన్నవరం నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న సీఎం... అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కాకినాడకు వెళ్లారు. 
 
ముందుగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వం తరపున సాయం చేస్తామని బాబు చెప్పారు. అనంతరం కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించారు. మరోవైపు బాణాసంచా ఘటనలో మంగళవారం ఉదయానికి 16కు చేరింది. మరో ముగ్గురు స్థానిక అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.