1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2019 (15:12 IST)

పెన్షన్‌కు విద్యుత్‌ రీడింగ్‌ ముడిపెట్టనున్న జగన్ సర్కారు?!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలైన పెన్షన్‌, రేషన్‌ కార్డులను తొలగించకుండా ఉండేందుకు, కొత్తది మంజూరు చేయాలంటే విద్యుత్‌ వినియోగాన్ని ముడిపెట్టనున్నారు. అంటే వినియోగదారులకు 200 యూనిట్‌లు దాటితే రేషన్‌ కట్‌, 300 యూనిట్‌లు దాటితే పెన్షన్‌ తొలగించాలన్న యోజనలో జగన్ సర్కారు ఉంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రేషన్ కార్డులు, పెన్షన్లు రద్దు కానున్నాయి. 
 
ఒక ఇల్లు ఉన్నప్పటికి ఒకటి కన్నా ఎక్కువ పోర్షన్‌లు ఉన్నవారు విద్యుత్‌ బిల్లులు తగ్గించుకునేందుకు ఒకటి కన్నా ఎక్కువ సర్వీసులు పొందారు. విద్యుత్‌ సంస్థల నిబంధనల ప్రకారం 100 - 200 యూనిట్లు దాటిని వారికి విద్యుత్‌ ఛార్జీలు యూనిట్‌కు అధికమొత్తంలో వసూలు చేస్తున్నారు. దీంతో ఎక్కువ సర్వీసులు పొందితే తక్కువ బిల్లులు వస్తాయని ఎక్కువమంది సర్వీసులు పొందారు. ఇది ఇప్పుడు షాక్‌ కొట్టింది. 
 
ఇప్పటివరకు వాలంటీర్లు చేస్తున్న సర్వేలో పోర్షన్‌ కరెంట్‌ బిల్లులే పరిగణనలోకి తీసుకుంటారన్న భావనలో ఉన్నారు. వాలంటీర్లు కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే అధికారులు మాత్రం భార్యభర్తల పేరుమీద ఆధార్‌ కార్డుతో అనుసంధానమై ఉన్న అన్ని సర్వీసులను కలిపి ఒక యూనిట్‌గానే తీసుకుంటామని చెబుతున్నారు. 
 
వీటిలో గృహ సర్వీసులతో పాటు వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక సర్వీసులను కూడా కలిపి ఒక యూనిట్‌గా తీసుకోనున్నారు. ఇప్పటివరకు సొంత పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇళ్లు మాత్రమే సొంత భవనాల కింద పరిగణించేవారు. కానీ విద్యుత్‌ వినియోగం పరిగణలోకి తీసుకుంటే బీఫారాల్లో ఇళ్లు ఉన్నవారు, స్వాధీనాల్లో ఇళ్లు ఉన్న, రోడ్ల పక్కన ఆక్రమించుకొని ఉంటున్న వారు కూడా ఈ జాబితాలో చేరుతారు. కారణం విద్యుత్‌ సంస్థలు ఎవరు ఉంటున్నారో వారి పేరు మీదే సర్వీస్‌ మంజూరు చేస్తాయి. దీంతో ఇల్లు బీఫారమని, స్వాధీనమని కుంటి సాకులు చెప్పే వీలు లేదు. 
 
భవిష్యత్తులో ఎప్పుడైనా పట్టాలు వస్తాయని, స్వాధీనాలలో ఉంటున్నవారు తమ పేరు మీదే విద్యుత్‌ కనెక్షన్‌లు పొందారు. ఇది ఇప్పుడు అతి పెద్ద గుదిబండగా మారింది. దీంతో ఇప్పటికప్పుడు సర్వీసులు మార్పించుకుందామనే ఆలోచనలో అనేకమంది ఉన్నప్పటికీ విద్యుత్‌ సంస్థల అధికారులు నిరాకరిస్తున్నారు. స్పష్టమైన పత్రాలు ఉంటేనే సర్వీస్‌ పేరు మారుస్తున్నారు.
 
అమ్ముకున్న వారు బాధితులే... 
ఎక్కువమంది ఇళ్లు అమ్ముకున్నారు. కొనుగోలు చేసిన వారు కొన్ని కారణాల వలన విద్యుత్‌ సర్వీసులను వారి పేరు మీదకు మార్చుకోలేదు. దీంతో వారు అనుభవించని విద్యుత్‌ కనెక్షన్‌లు కూడా వారి పేరు మీదకు వస్తాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
ఇక్కడ ఇల్లు.. పొరుగు రాష్ట్రాల్లో నివాసం... 
జిల్లాలో సొంత ఇల్లు ఉండి వేరే ప్రాంతాలు, వేరే రాష్ట్రాల్లో నివాసం ఉండేవారు కూడా ఆందోళనలోనే ఉన్నారు. విద్యుత్‌ వినియోగం ఆధారంగా లబ్ధిదారులు ఎంపికైతే తక్కువ విద్యుత్‌ వినియోగించే వారికి అద్దెకు ఇవ్వడం మేలు అని సరదాగా వ్యాఖ్యలు వినిపడుతున్నాయి. కారణం ఎక్కువ వినియోగిస్తే భవిష్యత్తులో మరిన్ని పథకాలు కూడా కోత పడతాయని భావిస్తున్నారు. 
 
విద్యుత్‌ బిల్లే ప్రామాణికం... 
విద్యుత్‌ వినియోగం ఆధారంగానే లబ్ధిదారు ఎంపిక ఉంటుంది. రాష్ట్రంలో ఆ కుటుంబ సభ్యుల పేరు మీద ఎక్కడ ఎలాంటి సర్వీసులు ఉన్నప్పటికీ అన్ని సర్వీసులు ఒక యూనిట్‌గానే కలిపి 300 యూనిట్‌లు దాటితే పెన్షన్‌ నిలిపివేస్తాం.. అద్దెలకు ఇచ్చినవారు ఆందోళన చెందుతున్నారు. అయితే అద్దెలు వచ్చే వారికి పెన్షన్‌ ఎలా ఇస్తారు.. వ్యాపార సంస్థలకు అద్దెకు ఇచ్చేస్థాయి ఉందంటే వారికి పెన్షన్‌ అవసరమా అనేది ప్రభుత్వ నిబంధన.