1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (07:07 IST)

విఫలమైన మంత్రుల వ్యూహాలు... సీఎం జగన్‌కు తొలి చెంపదెబ్బ...

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ఆమోదించుకునేందుకు వైకాపా మంత్రులు శతవిధాలా ప్రయత్నించారు. ఇందుకోసం గంటల కొద్దీ శాసనసభలోనే ఉంటూ గంటగంటకో వ్యూహం రచించారు. కానీ, అవన్నీ పూర్తిగా విఫలంకావడంతో రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు.. సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులా మారింది. 
 
నిజానికి రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా చేయాలని వైకాపా మంత్రులు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ, తెదేపా సీనియర్ల ముందు ఘోరంగా విఫలమయ్యారు. ఈ బిల్లు సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లు ప్రక్రియ ముగియడానికి కనీసం మూడు నెలలు పడుతోంది. అప్పటివరకు రాజధాని తరలింపు తాత్కాలికంగా ఆగినట్టే. 
 
నిజానికి రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియను ఆగమేఘాల మీద ముగించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యంగా బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ కమిటీకి పంపకుండా ఆపాలని పార్టీ సీనియర్లు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను ఆదేశించారు. దీంతోవారంతా రెండు రోజుల పాటు శాసనమండలిలోనే మకాం వేశారు. అయినప్పటికీ తెదేపా సభ్యులతో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు గుండె నిబ్బరంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి బిల్లును  సెలెక్ట్ కమిటీకి పంపించారు.