శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 23 జూన్ 2019 (14:55 IST)

హాస్టల్ బాలికపై కీచకపర్వం... గదిలో నిర్బంధించి గ్యాంగ్ రేప్

హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆరుగురు కామాంధులు ఆ బాలికను ఓ గదిలో బంధించి పది రోజుల గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఆరుగురు నిందితుల్లో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక దివ్యాంగుడు, కారు డ్రైవర్ ఒకరు ఉన్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రమైన ఒంగోలులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరుకు చెందిన ఓ విద్యార్థిని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తోంది. ఈమెకు ఒంగోలుకు చెందిన ఓ కారు డ్రైవర్ పరిచయమయ్యాడు. అది వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. 
 
ఆ తర్వాత అతని పిలుపుతో విద్యార్థిని ఇంటికి వెళుతున్నట్టు చెప్పి గుంటూరు నుంచి ఒంగోలుకు పది రోజుల కిందట వచ్చింది. బస్టాండుకు వస్తానని చెప్పిన కారు డ్రైవర్ రాలేదు. దీంతో అతనికి ఫోన్ చేయాలని భావించి, బస్టాండులో ఉన్న మరో వ్యక్తి వద్ద ఫోను తీసుకుని ఫోన్ చేసింది. కానీ, కారు డ్రైవర్ ఫోను లిఫ్టు చేయలేదు. 
 
అయితే, బస్టాండులో పని చేసే దివ్యాంగుడైన ఓ యువకుడు ఆమెను గమనించి... ఆమె స్నేహితుడు తనకు తెలుసంటూ నమ్మించి మరో ఫోన్ చేశాడు. అప్పటికీ రాకపోవడంతో అతని అచూకీ తనకు తెలుసంటూ బస్టాండు సమీపంలోని ఓ గదికి తీసుకెళ్లాడు. అక్కడకు తన మిత్రుడిని పిలిపించాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిసి ఆ బాలికను రాత్రంతా అత్యాచారం చేశారు. 
 
అంతటితో ఆగని ఆ దుర్మార్గులు... తాము ఉంటున్న గదికి ఇరుగుపొరుగువారి తాకిడి ఎక్కువగా ఉందని భావించి.. మరో గదికి తరలించారు. అక్కడ నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా పది రోజుల పాటు గదిలో బంధించి అత్యాచారం చేశారు. ఆమె ఏమాత్రం సహకరించకపోతే దివ్యాంగుడు చిత్ర హింసలు పెట్టినట్టు బాధితురాలు బోరున విలపిస్తూ చెప్పింది. ఇంజనీరింగ్ విద్యార్థులు సైతం ఆ బాలికకు నరకం చూపించారు. ఆ తర్వాత వారి నుంచి తప్పించుకున్న  బాలిక.. నేరుగా పోలీసులకు జరిగిన ఘోరం చెప్పింది. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసి బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. 
 
ఈ దారుణ కృత్యానికి కారకుడైన దివ్యాంగుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిచ్చిన సమాచారంతో నిందితుల్లో ముగ్గురు ఇంజినీరింగ్‌ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సామూహిక అత్యాచారం సంఘటన కావటంతో ఈ అంశాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే, నిందితుల వివరాలు గోప్యంగా ఉంచడం ఇపుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.