శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 మే 2017 (12:49 IST)

చంద్రబాబు అమెరికా టూర్.. మేయర్‌కు ఈ-మెయిల్.. అంతా జగన్ కుట్రేనా?

ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దేశంకాని దేశంలో ఏపీ పరువు తీసే విధంగా ఓ మెయిల్ రావడంతో టీడీపీ శ్రేణుల్లో గుబులు మొదలయ్యాయి. అమెరికాలో చంద్రబాబుపై మెయిల్ ద్వారా ఫిర్యాదు అం

ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దేశంకాని దేశంలో ఏపీ పరువు తీసే విధంగా ఓ మెయిల్ రావడంతో టీడీపీ శ్రేణుల్లో గుబులు మొదలయ్యాయి. అమెరికాలో చంద్రబాబుపై మెయిల్ ద్వారా ఫిర్యాదు అందింది. నవ్యాంధ్రలో పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటిస్తున్న చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు, వైసీపీ మద్దతుదార్లుగా భావిస్తున్న కొందరి ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనపై మేయర్‌‍కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అమెరికా పర్యటనలో భాగంగా బాబు డల్లాస్‍‌లోని ఇర్వింగ్ అనే పట్టణానికి వెళ్లారు. అదే సమయంలో ఇర్వింగ్ మేయర్ బేత్‌‍వాన్ డ్యూన్‌కు కొంతమంది ఈ-మెయిల్స్ పంపించారు. ఆ ఈ-మెయిల్‌లో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని.. మే 2014 నుంచి హోం శాఖను కూడా చూస్తున్నట్లు వుంది. ఇంకా చంద్రబాబు 20 మంది నిరుపేదల ఎర్రచందనం కూలీలను పోలీసులు ఎలాంటి కవ్వింపు లేకుండానే చంపేశారు. వారిపై ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్లుగా ముద్ర వేసింది. ఈ నిరుపేద కూలీలు రోజువారీ కూలీకోసం పని చేసేవారే. చట్టవిరుద్ధమైన ఎర్రచందనం స్మగ్లింగ్‌ గురించి వీరికేమీ తెలియదు.
 
ఎర్రచందనం స్మగ్లింగ్‌ మాఫియా ఈ కూలీలను నియమించుకుంటుందని.. ఈ మాఫియాకు అధికార పార్టీలోని అనేక మంది రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయని, కానీ కూలీలను అతి దగ్గరి నుంచి కాల్చి చంపారని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసిందని.. దీన్ని ధ్రువీకరించే దిశగా వికీపీడియా అడ్రెస్‌ను కూడా ఆ మెయిల్‌లో పొందుపరిచారు. ఈ మెయిల్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు.
 
ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రం పరువు తీసేలా వైకాపా అధినేత జగన్ కుట్రలు చేస్తున్నారని మంత్రి లోకేశ్ నిప్పులు చెరిగారు. ఈ విషయంపై నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. సమస్యలను అధిగమించేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించకుండా, అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ ఆలోచిస్తున్నారన్నారు. 
 
జగన్ చేసిన కుట్ర బహిర్గతమైందని, చంద్రబాబు అమెరికా టూర్ ద్వారా పెట్టుబడులు వస్తే.. తాను రాజకీయంగా సమాధి కావాల్సిందేనని.. అందుకే ఇలాంటి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ పద్ధతిని విడిచిపెట్టి నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను వైకాపా పోషించాలని సలహా ఇచ్చారు.