శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 2 మే 2017 (15:02 IST)

అవినీతిపై ఉద్యమం... రుజువైతే ఉద్యోగులు, అధికారులనైనా వదలొద్దు: ముఖ్యమంత్రి చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వంలో అవినీతిని

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వంలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. అవినీతిని అదుపులో ఉంచాలని.. ఇందుకోసం స్పెషల్ కోర్ట్స్ యాక్ట్‌ను రూపొందించాలన్నారు. అవినీతికి పాల్పడే ఉద్యోగులు, అధికారుల అక్రమాస్తులపై వచ్చిన ఫిర్యాదులను పూర్తిస్థాయిలో విచారించి.. ఆరోపణలు రుజువైతే ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించారు. 
 
ఇందుకోసం అవసరమైన నిబంధనలు రూపొందించి వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల బదిలీల్లో అవినీతికి ఆస్కారం ఉండరాదని.. ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడితే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా మార్కులు కేటాయించాలని.. మెరిట్ ఆధారంగానే బదిలీలు జరగాలని.. ఈ విషయంలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదికలపై కూడా నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 
 
ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరక్కుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏసీబీ కేసుల్లో విచారణకు అనుమతివ్వడాన్ని ఉన్నతాధికారులు ఆలస్యం చేయరాదన్నారు. ఏ ఉద్యోగి, అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారించేందుకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మూడు నెలల్లోగా అనుమతివ్వాలని ఆదేశించారు. లేనిపక్షంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ నేరుగా చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి అనుమతిచ్చినట్టే భావించాలన్నారు. సిటిజన్ చార్టర్, ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ సర్వీసులను ఉపయోగించుకుని అవినీతి నిరోధానికి కృషి చేయడంతో పాటు, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని అధికారులకు సూచించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కాల్ సెంటర్, మీ కోసం, కైజాలా యాప్, సీఎం కనెక్ట్ వంటి సాధనాల ఆధారంగా ప్రజలు నేరుగా ప్రభుత్వంతో సంప్రదించాలని సూచించారు. 
 
ఈ ఆఫీస్ అమలులో భాగంగా ప్రతి ఫైల్ నిర్ణీత సమయంలోగా క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఏ ఫైల్ అయినా మూడు రోజుల్లాగా క్లియర్ చేసేలా ఉన్నతాధికారులు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటల్స్, కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయడం ద్వారా.. పనుల్లో పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంజినీరింగ్ వర్క్స్ కు సంబంధించి నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడేది లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. 
 
రాష్ట్రంలోని ప్రతి జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగినీ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని.. ఉద్యోగుల అవినీతికి సంబంధించి నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదులు వస్తున్నాయని.. కాబట్టి ఉద్యోగులు విధినిర్వహణ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరించారు. అవినీతి రహిత పాలన అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని.. దీన్ని దృష్టిలో ఉంచుకోకుండా ప్రజల్ని పీడిస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్ పి ఠాకూర్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎ.బి.వెంకటేశ్వరరావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.