శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (14:15 IST)

అటవీశాఖలో ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. రూ. కోట్లు దండుకున్న ముఠా

ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలు వసూలు చేశారు ఓ ఘనుడు. డిగ్రీ చదువుతున్న గ్రామీణ విద్యార్థులు ఉద్యోగాలు వస్తాయని ఆశతో అప్పులు చేసి, వేసుకున్న నగలను తాకట్టు పెట్

ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలు వసూలు చేశారు ఓ ఘనుడు. డిగ్రీ చదువుతున్న గ్రామీణ విద్యార్థులు ఉద్యోగాలు వస్తాయని ఆశతో అప్పులు చేసి, వేసుకున్న నగలను తాకట్టు పెట్టి మరీ వేలకు వేలు సమర్పించారు. తీరా తాము డబ్బులు ఇచ్చింది ఒక ముఠా అని తెలిసి లబోదిబో మంటున్నారు. 
 
ఇటీవల ఓ చోరీ కేసులో పలువురిని అరెస్టు చేసిన టుటౌన్ పోలీసుల లిస్టులో సదరు మాయగాడు కూడా ఉన్నట్లు సమాచారం తెలుసుకుని తాము మోసపోయిన విషయాన్ని విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఇప్పటికీ న్యాయం జరగకపోవడంతో అల్లాడుతున్నారు. విద్యార్థులు, తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు వివరించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
 
చిత్తూరు జిల్లా కెవిబిపురం మండలం రాజులకండ్రిగ గ్రామానికి చెందిన ఓ యువకుడు యేడాది క్రితం శ్రీకాళహస్తి అటవీశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా విధుల్లో చేరాడు. అయితే అతని పద్దతి బాగోలేకపోవడంతో విధుల్లో చేరిన నెలరోజుల్లోనే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి విద్యార్థులను నమ్మించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా శ్రీకాళహస్తి డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న కొందరు విద్యార్థులతో పరిచయం పెంచుకున్నాడు. తాను అటవీశాఖలో ఉద్యోగం చేస్తానని, మీకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని విద్యార్థులను నమ్మించాడు. 
 
అంతేకాదు రేంజర్ అనే పేరుతో మరో వ్యక్తి ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకున్న నెంబర్ కు విద్యార్థుల సమక్షంలో ఫోన్ చేసి ఇదిగో రేంజర్ మాట్లాడుతున్నాడు. కావాలంటే మీరే మాట్లాడండి అంటూ విద్యార్థులకు సూచించాడు. రేంజరే మాట్లాడుతున్నట్లు ఇక మన డబ్బు ఎక్కిడికీ పోదులే అనే నమ్మకంతో విద్యార్థులు ఒక్కొక్కరు లక్షల రూపాయలు చెల్లించుకున్నారు. 
 
మొత్తం సుమారు 20 మంది విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. అంతే కాకుండా యూనిఫాం అంటూ మరి కొంత డబ్బులను అకౌంట్‌లో జమ చేయించుకున్నట్లు సమాచారం. డబ్బులు వేయడానికి ఒక్కరోజు ఆలస్యమైనా ఫోన్‌లో ఏం ఉద్యోగం వద్దా అంటూ బెదిరించేవాడు. దీంతో అప్పులు చేసి కొందరు, ఒంటిపై వేసుకున్న బంగారు చైను, ఉంగరాలను కుదవపెట్టి కొందరు ఆ మోసగాడికి డబ్బులు ఇచ్చారు. 
 
ఇలా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని పుత్తేరి, కాటూరు, కెవిబి పురం మండలంలోని కాళంగి, శ్రీకాళహస్తి పట్టణంతో పాటు పలు గ్రామాలకు చెందిన విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. తీరా ఉద్యోగాలు రాకపోవడంతో అనుమానంతో అతన్ని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా తిరుగుతున్నట్లు తెలిపారు. ఇటు ఉద్యోగాలు రాకుండా కట్టిన డబ్బులు తిరిగి రాక, ఈ విషయాన్ని ఇంటిలో చెప్పుకోలేక విద్యార్థులు నరకయాతనను అనుభవిస్తున్నారు.
 
ఇటీవల టుటౌన్ పోలీస్టేషన్‌లో వాహనాలు చోరీ చేసిన కొందరు దొంగలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. అందులో విద్యార్థులను మోసం చేసిన ముఠాలోని సభ్యులు కూడా ఉన్నారని తెలిసి ఐదారు మంది విద్యార్థులు తమకు జరిగిన అన్యాయాన్ని టుటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పోలీసులు ఈ కేసు గురించి పట్టించుకోలేదని సమాచారం.