శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 10 అక్టోబరు 2020 (20:25 IST)

మాతృభూమిపై ప్రేమతో సర్వం వదులుకున్న విశ్వనాధ్ పసాయత్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

విశ్వనాథ్ పసాయత్ జమిందారీ వ్యవస్థకు చెందిన వ్యక్తి అయినప్పటికీ మాతృభూమిపై ప్రేమతో సర్వం వదులుకుని, సమాజంలోని బలహీన, నిరుపేద వర్గాల కోసం పోరాడారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో దిగ్గజ వ్యక్తి, ప్రముఖ న్యాయమూర్తి దివంగత శ్రీ విశ్వనాథ్ పసయత్ 108వ జన్మదినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
 
కటక్‌లో శనివారం సాయంత్రం ఈ కార్యక్రమం జరుగగా, విజయవాడ రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ శ్రీ హరిచందన్ మాట్లాడుతూ దివంగత శ్రీ విశ్వనాథ్ పసయత్ సామాజిక ఉద్యమకారునిగా, సీనియర్ న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా దీనజనులకు సేవలు అందించారన్నారు. మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు శ్రీ విశ్వనాథ్ పసయత్ ప్రేరణ పొందారని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో చురుకైన పాత్ర పోషించారని గవర్నర్ గుర్తుచేసుకున్నారు.
 
జైలు జీవితం గడుపుతున్న స్వాతంత్య్ర సమరయోధుల హక్కులను పరిరక్షించేందుకు దివంగత పసయత్ చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని గవర్నర్ హరిచందన్ అన్నారు. పత్రికా సంపాదకుడిగా పసయత్ స్వేచ్ఛా పోరాటాన్ని ఎత్తిచూపటమే కాక, ప్రజలు ఉద్యమ కారులుగా మారేందుకు ప్రేరేపించారని గవర్నర్ ప్రస్తుతించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, లీగల్ లూమినరీ డాక్టర్ జస్టిస్ అరిజిత్ పసాయత్ సైతం తాను  తండ్రికి తగ్గ కుమారునిగా నిరూపించుకున్నారని ప్రస్తుతించారు.
 
డాక్టర్ జస్టిస్ అరిజిత్ పసయత్ సందేశంతో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, 'రాజ్యాంగ నైతికత, రాజ్యాంగ రక్షణ' అనే అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, భారత మాజీ అటార్నీ జనరల్ కె. పరాశరన్ ప్రసంగించారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మొహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ, దివంగత విశ్వనాథ్ పసాయత్ ఒక జాతీయవాదిగా వ్యవహరిస్తూనే వామపక్ష మొగ్గుతో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందారని, అణచివేతకు గురైన వర్గాల విముక్తి కోసం పోరాడారని గుర్తు చేసారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జోసెఫ్ కురియన్, ఒడిశా హైకోర్టుకు చెందిన పలువురు రిటైర్డ్, సిట్టింగ్ జడ్జిలు, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.