శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (14:48 IST)

ఎస్ఈసీ చేతికి చిక్కిన జగన్ సర్కారు... కొత్త స్కీమ్స్‌కు ఆయన అనుమతి తప్పనిసరి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఎన్నికల కమిషనరు రమేష్ కుమార్‌లకు ఏమాత్రం పొసగడం లేదు. వీరిద్దరూ ఢీ అంటే ఢీ అనే రీతిలో నడుచుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల కోడ్ అమల్లో వుంది. దీంతో కొత్త పథకాల అమలుకు ఎన్నికల సంఘం తప్పనిసరిగా తీసుకోవాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కొత్త పథకాలు ప్రవేశపెట్టాలన్నా, అభివృద్ధి పనులు చేపట్టాలన్నా ఎస్‌ఈసీని విధిగా సంప్రదించాల్సిన పరిస్థితిని తానే కొనితెచ్చుకుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఓసారి పరిశీలిద్ధాం.. 
 
కరోనా కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదాపడిన నేపథ్యంలో కోడ్‌ ఎత్తివేయాలంటూ ప్రభుత్వం గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కోడ్‌ ఎత్తివేతకు అంగీకరించిన సుప్రీం కోర్టు...  ఏవైనా కొత్త పథకాలు ప్రారంభించేటప్పుడు ఎస్‌ఈసీని సంప్రదించాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వును సవరించాలని ప్రభుత్వం సుప్రీం కోర్టులో మళ్లీ అప్పీలు చేసింది. దీనిపై సోమవారం కోర్టు మూడు వాక్యాల ఉత్తర్వు జారీ చేసింది.
 
'రాష్ట్ర ప్రభుత్వం తరపు కేసు వాదించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ... ఆంధ్రప్రదేశ్‌లో ఏమైనా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకునేలా అనుమతించాలని కోరారు. దీన్ని నోట్‌ చేసుకున్నట్లుగా పరిగణిస్తూ కేసును నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నాం' అని పేర్కొంది. 
 
పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం తనకు తానుగా ఎస్‌ఈసీని సంప్రదించాలన్నదే ఈ ఉత్తర్వు సారాంశం. వెరసి... కొత్త పథకం ప్రవేశపెట్టేముందు లబ్ధిదారుల ఎంపిక, ప్రామాణికత తదితర అంశాలన్నింటిని ఎస్‌ఈసీకి వివరించి, అది సంతృప్తి చెందితేనే దాన్ని అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నారు. అలా.. ప్రభుత్వమే ఎస్ఈసీ బోనులోపడింది. అయితే, సర్కారు ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేసిందా.. లేదా దీని వెనుక ఏదైనా మతలబు ఉందా అనేది తెలియాల్సివుంది.