గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (15:33 IST)

జగన్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు.. త్వరలో లండన్ టూర్

jagan
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయన పాస్ పోర్టును ఐదేళ్లకాలపరిమితితో పునరుద్ధరించాలని ఆదేశించింది. దీంతో జగన్ దంపతులు తలపెట్టిన లండన్ పర్యటనకు ఉన్న పాస్ పోర్ట్ అడ్డంకులు తొలగిపోయాయి. 
 
జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనకు డిప్లొమాటిక్ పాస్ పోర్టు ఉండేది. అయితే, గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో నిబంధనల మేరకు ఆయన డిప్లొమాటిక్ పాస్ పోర్టు రద్దు కావడంతో సాధారణ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 
 
ఐదేళ్ల కాలపరిమితితో జనరల్ పాస్ పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ నగరంలోని సీబీఐ కోర్టు ఆదేశించింది. కానీ, విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ పాస్ పోర్టు కాలపరిమితిని ఒక యేడాదికి మాత్రమే కుదిస్తూ, పలు షరతులు విధించింది. దీనిపై జగన్ హైకోర్టును ఆశ్రయించడంతో ఐదేళ్ల గడువుతో జగన్‌కు పాస్ పోర్టు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.