శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2019 (20:58 IST)

ఆ ప్రసారాల నిలిపివేతలో మాకు సంబంధం లేదు : పేర్ని నాని

రాష్ట్రంలో ఓ ప్రైవేట్ టీవీ ప్రసారాలను నిలిపివేయడంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టంచేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, కేబుల్ ఆపరేటర్లు తమ మంత్రులతో వారి సమస్యలు తెలుసుకునేందుకు సమావేశమయ్యారని తెలిపారు. అసత్య కథనాలు ప్రసారం చేయడం న్యాయమా అంటూ ప్రశ్నించారు. వారివద్ద ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చన్నారు. 
 
ఇకపోతే, ఏపీపీఎస్సీ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడాన్ని పేర్ని నాని సమర్థించార. ఉద్యోగ నియామకాల్లో ఇప్పటివరకు అమల్లో ఉన్న ఇంటర్వ్యూ వ్యవస్థను రద్దు చేసిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. 
 
జనవరిలో సీఎం జగన్ ఉద్యోగాల క్యాలెండర్‌ను ప్రకటిస్తారని, అందులో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారమే నియామకాలు జరుగుతాయన్నారు. లక్షకు పైగా ఉద్యోగాలను ఒకేసారి ఇచ్చి రికార్డు సృష్టించామన్నారు. రివర్స్ టెండరింగ్‌తో రూ.750 కోట్లు ఆదా అయినట్టు వెల్లడించారు. ప్రజలకు తమ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తోందని మంత్రి పేర్ని నాని చెప్పారు.

ఇంకోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగిపోయిన ఆ రెండు టీవీ ఛానళ్ళ ప్రసారాలను తక్షణం పునరుద్ధరించాలని టెలికాం వివాదాలు పరిష్కారానికి నెలకొల్పిన అప్పిలేట్ ట్రైబ్యునల్ (డీటీశాట్) ఆదేశించింది. పైగా, ఏపీ ఫైబర్ నెట్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. 
 
తమ ఆదేశాల ధిక్కరణను ట్రైబ్యునల్ తీవ్రంగా పరిగణిస్తూ.. గతంలో విధించిన జరిమానాతో పాటు మొత్తం రూ.32 లక్షలు టీడీశాట్ వద్ద జమచేయాలంటూ పేర్కొంటూ తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించాలని ఆదేశించింది.
 
కాగా, తమ సంస్థ ఇప్పటికే కోట్ల రూపాలయల నష్టాల్లో ఉన్నామని జరిమానా చెల్లించటం కష్టమని ఫైబర్ నెట్, ట్రైబ్యునల్‌కు తెలుపగా ట్రైబ్యునల్ ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆదేశాలను లెక్కచేయకపోతే కమిషనర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని పంపి ప్రసారాలు పునరుద్ధరించేలా చర్యలు చేపడతామని పేర్కొంది.
 
ఇటీవల రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ5 ప్రసారాలను అనధికారికంగా నిషేధించడంతో, సదరు ఛానళ్ల యాజమాన్యాలు టీడీశాట్‌ను ఆశ్రయించాయి. విచారణ జరిపిన అనంతరం ట్రైబ్యునల్ ఏపీ పైబర్ నెట్‌పై జరిమానా విధిస్తూ ఈ నెల ఒకటిన తీర్పు చెప్పింది. అప్పటినుంచి నేటివరకు రోజుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.32 లక్షలు ట్రైబ్యునల్లో జమ చేయాలని ఆదేశించింది.