1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (08:54 IST)

ఏపీలో 25 జిల్లాల ఏర్పాటు దిశగా సీఎం జగన్ అడుగులు??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో తమ పార్టీ తరపున ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్రంలో 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం 13 జిల్లాలను ఒక్కో లోక్‌సభ స్థానాన్ని ఒక్కో జిల్లాగా చేస్తూ మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై ఆయన 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
ఒక్కో లోక్‌సభను ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయడం వల్ల పరిపాలన మరింత సులభతరంగా ఉంటుందనీ, పైగా, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేసేందుకు సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ జిల్లాల కలెక్టర్లతో వ్యాఖ్యానించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు త్వరలోనే 25 జిల్లాలుగా మారనున్నాయి. ఆ ప్రకారంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న తిరుపతి పట్టణం చిత్తూరు జిల్లా నుంచి విడిపోయి జిల్లా కేంద్రంగా ఏర్పాటుకానుంది.